నేడు పాకిస్తాన్ మహిళలతో భారత్ ఢీ
రాత్రి 8.00గం.లకు
దుబాయ్: మహిళల ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు మరో కీలకపోరుకు సిద్ధమైంది. గ్రూప్ దశలో ఆడిన రెండు మ్యాచుల్లో ఘన విజయాలు సాధించిన హర్మన్ప్రీత్ సేన శనివారం జరిగే మూడో, చివరి లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ మహిళలతో తలపడనుంది. ఈ మ్యాచ్లోనూ గెలిస్తే గ్రూప్ టాపర్గా సెమీస్కు చేరనుంది. సెమీస్ బెర్త్ ఇప్పటికే సాధించిన భారతజట్టు గ్రూప్ టాపర్గా నిలవాలంటే పాకిస్తాన్పై గెలుపు తప్పనిసరి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో భారత జట్టు టైటిల్ ఫేవరెట్గా బరిలో దిగింది. తొలి మ్యాచ్లో థాయ్లాండ్పై 94పరుగుల తేడాతో, రెండో లీగ్ మ్యాచ్లో హాంకాంగ్పై ఏకంగా 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఉత్సాహంతో పాకిస్తాన్ మహిళలతో మ్యాచ్కు హర్మన్ప్రీత్ సేన సిద్ధమైంది. మరోవైపు పాకిస్తాన్ మహిళలు ఆడిన తొలి మ్యాచ్లో థాయ్లాండ్పై 35 పరుగుల తేడాతో విజయం సాధించిన ఉత్సాహంతో భారత్తో పోరుకు సిద్ధమైంది. గ్రూప్-ఎ నుంచి 2పాయింట్లతో పాకిస్తాన్ మహిళలజట్టు కూడా సెమీస్కు చేరువైనా.. థాయ్లాండ్ జట్టు హాంకాంగ్పై గెలిచి 2పాయింట్లతో ఉంది. దీంతో పాకిస్తాన్ జట్టు భారత్ చేతిలో ఓడినా.. చివరి లీగ్ మ్యాచ్లో హాంకాంగ్పై గెలిస్తే రెండో స్థానంతో సెమీస్కు చేరడం ఖాయం. ఇక గ్రూప్-బిలో శ్రీలంక మహిళలు ఆడిన 2మ్యాచుల్లోనూ గెలిచి 4పాయింట్లతో ఇప్పటికే సెమీస్ బెర్త్ సాధించగా.. రెండో బెర్త్కోసం బంగ్లాదేశ్(2పాయింట్లు) రేసులో ఉంది.
బ్యాటింగ్లో షెఫాలీ, మంధానకి తోడు రీచా ఘోష్, ఫుల్మాలీ ఫామ్లో ఉండడం భారత్కు కలిసిరానుంది. ఇక బౌలింగ్లో శ్రీచరణి, దీప్తి శర్మ స్పిన్ బాధ్యతలను, నందిని, ప్రేమా రావు, క్రాంతి గాడ్ పేస్లో సత్తా చాటుతున్నారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఇప్పటివరకు భారీ స్కోర్ చేయకున్నా.. కీలక మ్యాచుల్లో తనస్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం ఖాయం.
జట్లు(అంచనా)
భారత మహిళలు: హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), మంధాన, షెఫాలీ, ప్రతికా రావల్, రీచా ఘోష్(వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, ప్రేమా రావత్, నందిని శర్మ, క్రాంతి గాడ్, శ్రీచరణి.
పాకిస్తాన్ మహిళలు: ఫాతిమా సనా(కెప్టెన్), మునీబా అలీ(వికెట్ కీపర్), జుల్ఫికర్, గుల్ ఫరోజా, ఆయేషా జాఫర్, షాదాబ్ షమాస్, ఉన్-ఇ-హనీ, ఇమాన్ ఫాతిమా, తుబా హసన్, నష్రా సంధు, సదియా ఇక్బాల్.
అజిత్ అగార్కర్ గైర్హాజర్
ముంబయిలో జరిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశానికి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గైర్హాజరయ్యాడు. గురువారం జరిగిన సమీక్షా సమావేశానికి అజిత్ అగార్కర్ హాజరుకాకపోవడానికి గల కారణాలేమిటనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. ఈ సమావేశానికి ఆయన హాజరుకాకపోవడంలో ప్రత్యేక అర్థమేమీ లేదని వివరించేందుకు బిసిసిఐ చెప్పిన సమాధానంలోనూ పొంతన లేదు. దీంతో ఈ సందేహాలు మరింత బలపడ్డాయి. “ఆ రోజు అగార్కర్ ఊరిలో లేకపోవడంతో సమావేశానికి హాజరుకాలేకపోయారని, చాలా తక్కువ సమయంలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని, ఆ సమయంలో మా సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ నగరంలో లేరడని, ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నించామని, ఆయన ఉన్న ప్రాంతం నుండి ఆన్లైన్లో కూడా సమావేశంలో పాల్గొనే వీలు లేకపోయింది,” అని బిసిసిఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితంమే ఆఫ్ఘనిస్థాన్తో జరగబోయే మూడు మ్యాచ్ల సిరీస్ కోసం టి20 జట్టును ఎంపిక చేయడానికి సెలెక్టర్ల చైర్మన్ స్వయంగా ఆన్లైన్ ఎంపిక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అయితే, గురువారం జరిగిన ఆ సమీక్షా సమావేశానికి ఆయన ఎందుకు ఆన్లైన్లో ఎందుకు హాజరుకాలేకపోయారో అనే ప్రశ్నకు ఆయన సరైన వివరణ ఇవ్వలేదు.



