సినీనటి పావలా శ్యామల (75) ఇకలేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో ఆమె బాధపడ్డారు. గతంలో పవన్కల్యాణ్, సాయి దుర్గాతేజ్, దిల్రాజు సహా మరికొందరు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సాయం చేశారు. 1951లో ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో జన్మించిన పావలా శ్యామల అసలు పేరు నేతి శ్యామల. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆమె.. పదో తరగతి వరకు చదువుకున్నారు. నాటక రంగంతో నటనలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు. 1985లో ‘బాబాయ్ అబ్బాయ్’తో ఇండస్ట్రీలోకి వచ్చిన శ్యామల.. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్ణకమలం’ సినిమాతో గుర్తింపు పొందారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’లో సహాయ నటి పాత్రలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. గణేష్ పాత్రో రాసిన ‘పావలా’ నాటకంతో శ్యామలకు పేరు వచ్చింది. దీంతో అప్పటి నుంచి ఆమె ‘పావలా’ శ్యామల అయ్యారు.భిన్న పాత్రల్లో తనదైన నటనతో అందరినీ అలరించిన పావలా శ్యామల అంత్యక్రియలను నేడు (బుధవారం) ఫిల్మ్ నగర్లోని మహా ప్రస్థానంలో జరుపుతామని, దీనికి అవసరమ్యే ప్రతీదీ మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ (మా)నే పర్యవేక్షిస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు.
నటి పావలా శ్యామల కన్నుమూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



