నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 22న ఈ పిటిషన్లపై విచారణ చేపడతామని గురువారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని 2024 ఆగస్టు 4న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని వారు సవాల్ చేశారు. సుధీర్ఘ వాదనల తర్వాత.. కాంగ్రెస్ సర్కార్ ప్రతిపాదనలతో ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీఖాన్ల నియామకాన్ని గతేడాది ఆగస్టు 13న సుప్రీంకోర్టు రద్దు చేసింది.
ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగి స్తోంది. ఈక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ తరపున సీనియర్ అడ్వొకేట్ సంజయ్ ఎం నూలీ ఇంప్లీడ్ అప్లికేషన్(ఐఏ) దాఖలు చేశారు. అలీఖాన్ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారని, ఆయనను ఎమ్మెల్సీగా కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. అయితే… ఈ పిటిషన్లపై గత నెల 3వ తేదీన విచారణ జరిపిన ధర్మాసనం.. తెలంగాణలో గవర్నర్ కోటాలో కొత్తగా చేపట్టబోయే ఎమ్మెల్సీ నియామకాలకు గత సుప్రీంకోర్టు ఆదేశాలు అడ్డంకులు కాదని స్పష్టం చేసింది. మంత్రి వర్గం సిఫారసు చేసే పేర్లపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై విచారణ ఏప్రిల్ 22కు వాయిదా
- Advertisement -
- Advertisement -



