– 60 మంది యువత స్వచ్ఛంద రక్తదానం
– ప్రాణదాతలుగా నిలిచిన రక్తదాతలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలోని ఉమా చంద్ర ఫంక్షన్ హాల్ లో బిర్రం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ శిబిరంలో 60 మంది యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. శిబిరానికి అశ్వారావుపేట, భద్రాచలం ఏరియా ఆసుపత్రుల వైద్యులు, వైద్య సిబ్బంది హాజరై రక్తదాన ప్రక్రియను నిర్వహించారు. రక్తదాతల ఆరోగ్య పరిస్థితిని ముందుగా పరీక్షించి, రక్తపోటు, హిమోగ్లోబిన్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మాత్రమే రక్తాన్ని సేకరించారు.
ఈ సందర్భంగా డా. మౌనిక (ఎంఎస్–ఓబీజీ, ఆర్ఎంఓ), డా. గోపాలకృష్ణ (ఎంబీబీఎస్, సివిల్ అసిస్టెంట్), గణేష్ (ఎఫ్సీఏ), సిస్టర్ మేరీ సృజన, శిరీష (పీసీ), మహేష్ (అంబులెన్స్ డ్రైవర్), ఎడిల్టన్ దాలు (ల్యాబ్), ఎల్.టి. శ్రీనివాసరావు తదితర వైద్య సిబ్బంది సేవలందించారు.
పలుమార్లు రక్తదానం చేసిన దాతలను నిర్వాహకులు ప్రత్యేకంగా సన్మానించారు. రుద్ర సతీష్ 40వసారి, రామినేని రమేష్బాబు 15వసారి, లోకం అశ్విని కుమార్ 8వసారి, అల్లం శివగణేష్ 7వసారి, ఉప్పల వినయ్ కుమార్ 6వసారి రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. అలాగే ఆది ప్రశాంత్, బి. మంగరాజు (ఆసుపాక) కూడా పలుమార్లు రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రమాద బాధితులు, గర్భిణీలు, శస్త్రచికిత్సలు చేయించుకునే రోగులకు స్వచ్ఛందంగా దానం చేసిన రక్తం ఎంతో ప్రాణాధారమవుతుందని వైద్యులు తెలిపారు. ప్రతి ఆరోగ్యవంతుడు నిర్దిష్ట వ్యవధిలో స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం నిర్వహించిన అన్నసమారాధనలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రసాద్, ఉప్పల మురళి, గ్రామ సర్పంచ్ కొవ్వశి రాజు, లోకం సాంబశివరావు, మారుతి లక్ష్మణరావు, ఉప్పల నాగమహేశ్వరరావు, బిర్రం రాజేష్, బిర్రం ఉదయ్ కుమార్, లోకం అశ్విని, ఉప్పల సుదర్శన్రావుతో పాటు గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, “రక్తదానం మహాదానం. ఒక యూనిట్ రక్తం పలువురి ప్రాణాలను కాపాడగలదు. యువత సేవా కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొనాలి” అని పిలుపునిచ్చారు. “రక్తదానం – మహాదానం… మానవ సేవే మాధవ సేవ” అనే సందేశాన్ని చాటిచెప్పిన ఈ మెగా రక్తదాన శిబిరం వినాయకపురం గ్రామంలో ఆదర్శ సేవా కార్యక్రమంగా నిలిచిందని గ్రామ ప్రజలు, వైద్యులు, పాల్గొన్నవారు కొనియాడారు.



