నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం ఉప్పరి పల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో ప్రోటోకాల్ వివాదం చెలరేగి ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ బొజ్జ గీతారెడ్డి అధ్యక్షతన సభ జరుగుతుండగా, ఆమె భర్త అమరేందర్ రెడ్డి వేదికపై కూర్చోవడాన్ని కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు రవీందర్ రావు, అల్వాల్ గౌడ్ ప్రశ్నించారు. తాను ప్రజావాణి కోఆర్డినేటర్నని అమరేందర్ చెప్పగా, అది అధికారిక పదవి కాదని వారు వాదించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో గ్రామసభ వాయిదా పడింది.
ఒకే పార్టీ లోపలే తలెత్తిన గొడవ
గ్రామసభలో ప్రోటోకాల్ అంశం, అవగాహన లేక ఒకే పార్టీకి చెందిన వారి మధ్య కమ్యూనికేషన్ లోపంతోనే ఈ వివాదం తలెత్తి ఉద్రిక్తత ఏర్పడిందన్నారు. వేదికపై కూర్చోవడం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉండాలని తెలిపారు. వాగ్వాదం పెరగడంతో పోలీసుల సహాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకుని గ్రామసభను వాయిదా వేసినట్లు చెప్పారు. త్వరలోనే మళ్లీ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
– పంచాయతీ కార్యదర్శి, ప్రదీప్ రావు, ఉప్పరి పల్లి గ్రామం



