Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యార్థి, నిరుద్యోగులను మోసం చేసిన రాష్ట్ర బడ్జెట్‌

విద్యార్థి, నిరుద్యోగులను మోసం చేసిన రాష్ట్ర బడ్జెట్‌

- Advertisement -

పీడీఎస్‌యూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యార్థి, నిరుద్యోగులను మోసం చేశారని ప్రొగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (పీడీఎస్‌యూ) విమర్శించింది. ఈ మేరకు శుక్రవారం పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పి.మహేశ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. కొఠారి కమిషన్‌ విద్యారంగానికి 30 శాతం నిధులు, ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్‌ 18 శాతం నిధులు కేటాయించాలన్న సిఫారసులు, కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో 20 శాతం నిధులు కేటాయిస్తామన్న హామీని విస్మరించి 8.2 శాతమే కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒయూకు రూ.1,000 కోట్లు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళ యూనివర్సిటీకి రూ.400 కోట్లు కేటాయించి మిగిలిన యూనివర్సిటీలను విస్మరించారని తెలిపారు. రూ.8,500 పెండింగ్‌ రీయంబర్స్‌మెంట్‌ స్కాలర్‌షిప్పుల కోసం నిధులు కేటాయించాలేదన్నారు. విద్యారంగానికి బడ్జెట్‌ పెంపు కోసం ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.

బడ్జెట్లో విద్యారంగానికి అన్యాయం :డీటీఎఫ్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 8.2 శాతం నిధులు కేటాయించడం అన్యాయమని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డిలు నిరసన వ్యక్తం చేశారు. విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. తిరిగి సమీక్షించి కనీసం 20 శాతం నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు.

నిరాశ పరిచిన కేటాయింపులు : టీఎస్పీటీఏ
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి చేసిన కేటాయింపులు నిరాశ పరిచాయని తెలంగాణ స్టేట్‌ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్పీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్‌ అలీ, ఆర్‌ రోహిత్‌ నాయక్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. విద్యాశాఖకు కనీసం 20 శాతం నిధులు కేటాయిస్తేనే ప్రభుత్వం ప్రకటించిన విద్యా లక్ష్యాలను సాధించేందుకు అవకాశం ఉంటుందని వారు తెలిపారు. నిజంగా ప్రాథమిక విద్య బలోపేతానికి చిత్తశుద్ధి ఉంటే, నిధులను కనీసం 15 శాతానికి పెంచాలని వారు డిమాండ్‌ చేశారు.

అధ్యాపకుల హర్షం
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివే విద్యార్థినీ, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయడం పట్ల తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో దాదాపు లక్షన్నర మంది విద్యార్థినీ, విద్యార్థులకు శారీరక, మానసిక వికాసానికి మేలు కలుగుతుందని సీఎం రేవంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం ప్రవేశ పెట్టడం పట్ల గెజిటెడ్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ జి.లింగా నాయక్‌ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థి సంక్షేమానికి, సమాన విద్యావకాశాల సాధనకు, సామాజిక న్యాయానికి బలమైన అడుగు అని సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

6 వేల పాఠశాలకు నిధులివ్వాలి : పీటీఏ టీజీ
రాష్ట్రంలో కనీసం 6 వేల పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ (పీటీఏ టీజీ) రాష్ట్ర అధ్యక్షులు కె.మల్లికార్జున్‌ రెడ్డి, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ కె.శారద తదితరులు డిమాండ్‌ చేశారు. అల్పాహారం, నగదు రహిత వైద్యం, ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలన్న నిర్ణయాలను వారు స్వాగతించారు.

విద్యారంగాన్ని విస్మరించిన తెలంగాణ బడ్జెట్‌ :పులి దేవేందర్‌ ముదిరాజ్‌
రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందనీ, సరిపోని నిధులు ఇవ్వకపోవడం దారుణం అని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్‌ ముదిరాజ్‌ పత్రిక ప్రకటనలో విమర్శించారు. పెండింగ్‌ బిల్లులు, పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆరోగ్యం పథకం కింద ఉచిత వైద్యంతో పాటు 1 నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానం అమలు చేసే విధానాన్ని స్వాగతించారు.

స్వాగతిస్తున్నాం :2024 డీఎస్సీ ఉపాధ్యాయ రాష్ట్ర సంఘం
రాష్ట్‌ బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రాధాన్యతనిచ్చారని 2024 డీఎస్సీ ఉపాద్యాయ రాష్ట్ర సంఘం రాష్ట్ర నాయకులు రావుల రామ్మోహన్‌ రెడ్డి తదితరులు తెలిపారు. ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్‌ వరకు బ్రేక్‌ పాస్ట్‌ పథకం అమలు తదితర సంస్కరణలు బాగున్నాయని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -