– బస్సు స్వాధీనం, కేసు నమోదు
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం రేగళ్లపాడు-బుగ్గపాడు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పశువులను మేపుతున్న తురసం రాజులు (60) అనే పశువుల కాపరి ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బుగ్గపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. పాల్వంచ నుంచి సత్తుపల్లి వైపు వెళ్తున్న ‘సుమతి’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో వచ్చి కాపరిని ఢీకొట్టింది. బస్సు సైడ్ లగేజ్ డోర్ తెరుచుకుని ఉండటంతో, అది నేరుగా రాజులుకి తగిలి తీవ్ర గాయాలయ్యాయి. లగేజ్ డోర్ తెరిచి ఉన్నా పట్టించుకోకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



