– రేజర్లలో ‘శ్రీరామ హృదయ’ కలశ శోభాయాత్ర
నవతెలంగాణ-సత్తుపల్లి
పరమపూజ్య శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్ర (జన్మదిన) మహోత్సవాల పూర్వరంగంగా సత్తుపల్లి మండలం రేజర్లలో ఆధ్యాత్మిక వైభవం విరబూసింది. శ్రీస్వామివారి దివ్య సంకల్పంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లోని 1300 మండలాలకు పంపించిన అత్యంత పవిత్రమైన ‘శ్రీరామ హృదయ’ కలశం రేజర్ల గ్రామానికి చేరుకుంది. గురుపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ ప్రవచనకర్త శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రామకృష్ణమాచార్యస్వామి సమక్షంలో, స్థానిక శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించి ఘనంగా శోభాయాత్ర సాగించారు.
ఈ సందర్భంగా స్వామివారి లైవ్ ప్రోగ్రామ్ ద్వారా భక్తులందరూ ఏకమై సామూహిక శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం, యతిరాజ వింశతి, ధాటి పంచక స్తోత్ర పఠనం చేసి తరించారు. అనంతరం శ్రీమాన్ రామకృష్ణమాచార్యస్వామి మాట్లాడుతూ.. జగదాచార్యులైన చిన్న జీయర్ స్వామివారు లోకకళ్యాణార్థం అందిస్తున్న సేవలు పునీతమైనవని, వారు నూరేళ్లు ఆరోగ్యకరంగా వేంచేసి ఉండి ధర్మప్రచారం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ ‘శ్రీరామ హృదయ’ కలశాన్ని ప్రతి గడపకూ తీసుకెళ్లి, శ్రీరామనామ స్మరణతో బియ్యం సమర్పించే ఈ మహాక్రతువు సత్తుపల్లి మండలమంతటా భక్తిపారవశ్యాన్ని నింపుతుందని ఆయన పేర్కొన్నారు.



