– విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్
నవతెలంగాణ – సత్తుపల్లి
సత్తుపల్లి కేంద్రంగా వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. శనివారం సత్తుపల్లిలోని ఆ సంఘ భవనంలో కేశవరెడ్డి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యదర్శి నివేదికను ప్రకాశరావు, ఆర్థిక నివేదికను జి. కృష్ణయ్య సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు మాట్లాడారు. ఖమ్మం జిల్లా కేంద్రం సత్తుపల్లికి 80 కి.మీ. దూరంలో ఉండుట వల్ల పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
సబ్ ట్రెజరీ పరిధిలోని వేలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల కోసం సత్తుపల్లిలోనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. హెల్త్ స్కీమ్ కోసం ముందస్తు విధివిధానాలు లేకుండానే వేతనాలు, పెన్షన్లలో 1.5% మినహాయిస్తున్నారని మండిపడ్డారు. మినహాయింపులు చేస్తున్నప్పటికీ ఆసుపత్రులలో హెల్త్ కార్డులను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఉద్యోగులకు సరైన హెల్త్ కార్డులను కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. హైదరాబాద్లో చర్చలు జరుగుతున్నా, హెల్త్ కార్డ్ల అమలుపై ఎలాంటి ఆశాజనక ఫలితాలు రావడం లేదన్నారు.
తక్కువ పెన్షన్ పొందే ఫ్యామిలీ పెన్షనర్ల నుంచి 1.5% కోత విధించడం వారికి తీవ్ర ఆర్థిక భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యామిలీ పెన్షనర్లకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని సంఘం సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన ఆరు డీఏ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పీఆర్సీ నివేదికను తెప్పించుకుని, నూతన వేతన సవరణ ఉత్తర్వులను త్వరితగతిన జారీ చేయాలన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులతో పాటు సుబ్బారావు, వెంకటరత్నం, కమలకుమారి పాల్గొన్నారు.



