ప్రపంచ మార్కెట్లపై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నం: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
భగత్సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం
నవతెలంగాణ-సిటీబ్యూరో
సామ్రాజ్యవాదం యుద్ధాలను ప్రేరేపిస్తోందని, ప్రపంచ మార్కెట్పై ఆధిపత్యం కోసం అమెరికా యుద్ధం పేరుతో నర మేధానికి పాల్పడుతోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. భగత్సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా సోమవారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముషీరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పివి.నర్సింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్కు చెందిన డాక్టర్ ఎన్వి.సుధాకిరణ్ ఆధ్వర్యంలో రక్తదాతలకు బీపీ, షుగర్ టెస్టులు చేశారు. అంతకుముందు భగత్సింగ్ చిత్రపటానికి పాలడుగు భాస్కర్ పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. నాలుగు వారాలుగా అమెరికా యుద్ధం పేరుతో భయబ్రాంతులకు గురిచేస్తోందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు వర్గ పోరాటాలు చేయడమే భగత్సింగ్కు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు.
వలసవాదులు, సామ్రాజ్యవాదులను తరిమికొట్టాలనే ఆలోచన కలిగిన వ్యక్తి భగత్సింగ్ అన్నారు. జాతీయోధ్యమ సమయంలో గాంధీజీ పిలుపునకు ప్రేరేపితులై కీలక పాత్ర పోషించారని కొనియాడారు. జాతీయోద్యమంలో తిరుగుబాటుకు నాంది పలికిన గొప్ప మహానుభావుడు భగత్సింగ్ అన్నారు. అసమానత, పేదరికం, దోపిడీ పోవాలని వర్గ పోరాటానికి భత్సింగ్ నాంది పలికారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు విఎస్.రావు, ఎస్వి.రమ, రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్, శ్రీకాంత్, సుధాకర్, హైదరాబాద్ సౌత్ జిల్లా సెక్రెటరీ ఎం.శ్రావణ్కుమార్, అధ్యక్షులు మీనా, హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షులు దశరథ్, సెక్రెటరీ కుమారస్వామి, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సోమన్న, ఏ.సునిత, హైదరాబాద్ సిటీ నాయకులు మహేందర్, తదితరులు పాల్గొన్నారు.



