Wednesday, March 25, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆహారం దయకాదు, ప్రాథమిక హక్కు

ఆహారం దయకాదు, ప్రాథమిక హక్కు

- Advertisement -

”దేశ అభివృద్ధి అంటే రంగుల గోడలు, అద్దాల మేడలు కాదు, పౌరుని నైతిక అభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి” అని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఏనాడో చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజల జీవన ప్రమాణాలు, ముఖ్యంగా పేదల స్థితి మెరుగుపడాలి. అలాంటి పరిస్థితిలో పేద విద్యార్థులకు విద్యనందించడం దేశ నిర్మాణంలో కీలకభాగం. కానీ, ఇటీవల గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఈ నైతిక అభివృద్ధిని నిరాకరించేలా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం, కోడిగుడ్డు, ఇచ్చే దుస్తుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు పేద పిల్లల పట్ల వ్యతిరేకతను చూపెడుతున్నాయి. ఎంతో మేధావిగా సుభాషితాలు పలికే వ్యక్తి ఇలా మాట్లాడాడంటే ఒకటి, ఆయనకు దేశం గురించి, వారి జీవన ప్రమాణాల గురించి ఏ మాత్రం తెలియదని అర్థమవుతోంది. రెండవది, సుప్రీంకోర్టు, భారత రాజ్యాంగం పట్ల గౌరవం లేదని తెలుస్తోంది. మూడవది, ప్రపంచవ్యాప్తంగా సంక్షేమ విధానాలపై కూడా అవగాహన లేదని స్పష్టమవుతోంది. ”ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడమేంటి?వారి భోజనం వారే తెచ్చుకోవాలి, లేకపోతే చదువు మానేయమనండి, భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి చదవమంటే చదువుతాడా? మంచిగా శోభనం పెళ్లికొడుకులా మంచం ఎక్కి కూర్చుంటాడు” ఈ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరం. ముఖ్యంగా భారతదేశంలోని అణగారిన, అట్టడుగు వర్గాల పేద పిల్లల పరిస్థితులపై కనీస సానుభూతి కూడా లేనట్టుగా ఈ వ్యాఖ్యలున్నాయి.

భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకం అనేది యాదృచ్ఛికంగా వచ్చిన పథకం కాదు. 1925లో మద్రాస్‌ ప్రాంతంలో ప్రారంభమైన ఈ పథకం, 1960 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో కుమారస్వామి కామరాజు నాయకత్వంలో విస్తృతంగా అమలు చేయబడింది. పేద పిల్లలు ఆకలితో చదువుకోలేరనే వాస్తవాన్ని గుర్తించిన కామరాజు విద్యతో పాటు ఆహారం కూడా అవసరమని గుర్తించారు. ఈ దృక్ప థమే తరువాత దేశవ్యాప్తంగా పథకంగా మారి, 1995 ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం ”నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆఫ్‌ న్యూట్రిషనల్‌ సపోర్ట్‌ టు ప్రైమరీ ఎడ్యుకేషన్‌ -ఎన్‌. పి.ఎన్‌. ఎస్‌.పి.ఈగా ప్రారంభించింది. ప్రస్తుతం ఇది పి.ఎమ్‌ పోషణ్‌ పేరుతో కొనసాగుతోంది. అంటే మిడ్‌డే మీల్స్‌ పథకం అనేది చారిత్రాత్మకంగా, సామాజికంగా, శాస్త్రీయంగా అవసరమైన పథకం. ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలలకు చదవడానికి ఎవరు వెళ్తున్నారంటే సమాజంలో అణగారిన, అట్టడుగు వర్గాల పిల్లలే. ఈ కనీస సామాజిక వాస్తవాన్ని కూడా గరికపాటిి అర్థం చేసుకోకపోవడం బాధాకరం.సమాజంలో అట్టడుగున ఉన్న కులాల వారు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు మాత్రమే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద సుమారు 11 కోట్ల నుండి 12 కోట్ల వరకు పిల్లలు మధ్యాహ్న భోజనం పొందుతు న్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు కేవలం 4 నుండి 5 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఈ ఐదు రూపాయల భోజనాన్ని కూడా గరికపాటి ప్రశ్నించ డం హాస్యాస్పదం. 2001 నవంబర్‌ 28న సుప్రీం కోర్టు మధ్యాహ్న భోజన పథకాన్ని ఒక న్యాయబద్ధ హక్కుగా గుర్తించింది. పాఠశాలల్లో పిల్లలకు పోషకాహారం అందించడం ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పథకాలు అమలులో ఉన్నాయి. అమెరికాలో రెండు కోట్ల మంది పిల్లలకు, ఇంగ్లాండ్‌లో 20 లక్షల మందికి, జపాన్‌లో దాదాపు 90 లక్షల నుండి కోటి మందికి, సౌత్‌ కొరియాలో 60 లక్షల మంది విద్యార్థులకు ఉచిత భోజనం అందిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పిల్లలకు సమతుల్య పోషకాహారం అందించేందుకు ఈ పథకాలను అమలు చేస్తున్నారు. యునెస్కో నివేదిక ప్రకారం, పిల్లల ఆరోగ్యం, అభ్యసనంలో పాఠశాల భోజనం కీలకపాత్ర పోషిస్తుంది. సరైన న్యూట్రిషన్‌ ఉంటేనే విద్యార్థులు సమర్థ వంతంగా నేర్చుకోగలరు.అందరూ కలిసి భోజనం చేయడం ద్వారా సామాజిక తారతమ్యాలు తగ్గుతాయి. చైల్డ్‌ లేబర్‌ నివారణలో కూడా మిడ్‌డే మీల్స్‌ కీలక పాత్ర పోషించింది. ఆకలి కారణంగా పనికి వెళ్లే పిల్లలను పాఠశాలకు తీసుకురావడంలో ఈ పథకం ఎంతో సహాయ పడింది.హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ సర్వే ప్రకారం 92శాతం మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. 80శాతం తల్లిదండ్రులు హాజరు, నమోదు పెరిగిందని అంగీకరించారు. గుడ్డు గురించి కూడా గరికపాటి నోరు పారేసుకున్నారు. ప్రతి కోడిగుడ్డులో సుమారు ఆరు గ్రాముల ప్రోటీన్‌ ఉంటుంది. ఒమేగా-3, విటమిన్లు, కాల్షియం, వంటి పోషకాలు అందులో ఉన్నాయి. అలాంటి ఆహారాన్ని వ్యతిరేకించడం పిల్లల ఆరోగ్యాన్ని కూడా హానికరమే తప్ప వేరేకాదు.
”నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వుతిను, ప్రభుత్వాల దగ్గర డబ్బులున్నాయా?, ప్రభుత్వ కర్తవ్యం చదువు చెప్పడం మాత్రమే, పుస్తకాలివ్వడం, అన్నం పెట్టడం, యూనిఫామ్‌ ఇవ్వడం ప్రభుత్వ పనికాదు” ఈ మాటల వెనుక ఏ ఉద్దేశం దాగుందో తెలీదు కానీ, ఆయన అజ్ఞానం మాత్రం బయటపడింది. ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? అని ప్రశ్నించే ముందు, ప్రజలే పన్నులు కట్టి ప్రభుత్వాలను నడిపిస్తున్నారని గరికపాటి గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం అనేది ఒక వ్యాపార సంస్థ కాదు, అది ప్రజల సంక్షేమం కోసం ఉన్న వ్యవస్థ. పేద విద్యార్థులకు అన్నం పెట్టడం, పుస్తకాలివ్వడం, బట్టలందించడం ఇవన్నీ ఖర్చులు కాదు, ఇది ప్రభుత్వం కర్తవ్యం. ఈ దేశంలో పుట్టిన ప్రతి చిన్నారి చదవాలి, ఆరోగ్యంగా ఎదగాలి, గౌరవంగా బతకాలి. ఇది ఎవరి దానమో కాదు, ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మధ్యాహ్న భోజన పథకం ఆ హక్కును అమలు చేసే ఒక శక్తివంతమైన సాధనం. ఆకలి ఉన్నప్పుడు చదువు ఉండదు, పోషకాహారం లేకపోతే అభివృద్ధి ఉండదు.ఈ ప్రాథమిక సత్యాన్ని నిరాకరించడం అంటే పిల్లల భవిష్యత్తును నిరాకరించడమే అవుతుంది. ఒక పేద కుటుంబంలో పుట్టిన పిల్లవాడు తన పరిస్థితులను ఎంచుకోలేడు. కానీ, అతనికి సమాన అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత మన సమాజానిదే. అదే రాజ్యాంగం చెప్పిన సామాజిక న్యాయం.
గరికపాటి నిజంగా సమాజంపై శ్రద్ధ ఉంటే, ఎన్నికల సమయంలో జరిగే అవకతవకలు, పేదల సమస్యలు, నిరుద్యోగం, అస మానతలపై ఎందుకు మాట్లాడటం లేదు? పేద విద్యార్థులపైనే విమర్శలెందుకు కేంద్రీకరిస్తున్నారు? ఇలాంటి వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తి అభిప్రాయాలుగా తీసుకుని వదిలేయలేం. ఇవి రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే ప్రయత్నాలు. అలాంటి వ్యాఖ్య లపై ప్రభుత్వాలు స్పందించాలనే వాదన కూడా సమాజంలో బలంగా వినిపిస్తోంది. రాజ్యాంగ విలువలను కించపరచే, బలహీన వర్గాల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు మేధా వులు అభిప్రాయపడుతున్నారు. మనం అనుసరించా ల్సింది గరికపాటి లాంటి వ్యక్తుల అభిప్రాయాలు కాదు, భారత రాజ్యాంగ విలువలను. మనం నిర్మించాల్సింది విమర్శలు, వివక్షలు, అసమానతలు కాదు, సమానత్వం, న్యాయం, మానవత్వం ప్రధానం గా ఉండే సమాజం. ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా పేద పిల్లలకు, గౌరవంతో జీవించే హక్కు ఉందనే భావనను మన ఆలోచనల్లో, మన వ్యవస్థల్లో స్థిరపరచాలి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేసే హక్కు కాదు,అది ప్రతి పౌరుడి గౌరవం, ఆహారం, విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక హక్కులు పరిరక్షించబడే వ్యవస్థ. అప్పుడే ప్రతి పిల్లవాడు ఆకలి, అవమానం లేకుండా, గౌరవంతో జీవిస్తారు. అదే ‘నేటి బాలలు రేపటిపౌరుల’కు సార్థకత.

జంగిలి దర్శన్‌
9652379132

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -