నవతెలంగాణ-హైదరాబాద్: అసోం నగావ్ జిల్లాలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) క్యాంపులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ASI).. ఇద్దరు సహచర జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కాల్పుల ఘటనలో మరో జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి.
మంగళవారం ఉదయం సుమారు 7:00 గంటల సమయంలో బల్లాని ప్రేమబరం అనే ఏఎస్ఐ 34వ బెటాలియన్ క్యాంప్ ఆఫీస్ మెయిన్ గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఇంతలో గార్డు రూమ్లోని ఇన్సాస్ రైఫిల్ తీసుకుని వెనుక వైపు వెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న విష్ణు ప్రసాద్ బఘేల్పై కాల్పులకు దిగడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఆ వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అక్కడికి వెళ్లిన రామ్నవల్ సింగ్ యాదవ్పైనా కాల్పులు జరపడంతో.. ఆయన కూడా స్పాట్ డెడ్ అయ్యారు.
ఆ తర్వాత మనే గోవింద్ శ్రీపుల్ అనే జవాన్నూ కాల్చారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల అనంతరం శిబిరంలోని బ్యారక్లోకి వెళ్లిన ప్రేమబరం.. అదే తుపాకీతో తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. గాయపడిన జవాన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీనియర్ సీఆర్పీఎఫ్, పోలీస్ అధికారులు.. వెంటనే శిబిరానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాల్పులకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వెనుక వ్యక్తిగత లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.



