నవతెలంగాణ కాటారం
ఒడిపిలవంచ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఉపసర్పంచ్ ఇసునం మహేందర్, వావిళ్ళ సాజన్ కలిసి బుధవారం సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించి, మెనూ ప్రకారం పోషకాహారం అందించాలన్నారు. వారు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శుభ్రతతో కూడిన, పోషక విలువలతో ఉన్న ఆహారం వడ్డించాలని మధ్యాహ్న భోజన వర్కర్లకు, ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల అభివృద్ధికి ఆహారం కీలకమని పేర్కొన్నారు.
అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి, సమయపాలనతో చదువుకుని పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులై పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు గౌరవం తీసుకురావాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అధిరోహించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, వావిళ్ళ గణేష్ తదితరులు పాల్గొన్నారు.



