సెబీ కఠిన చర్యలు.. ఆ సంస్థ షేర్లు 15 శాతం పతనం
ముంబయి : ప్రముఖ మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ (జిఇఎల్)కు సెబీ భారీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్లోని కంపెనీకి చెందిన విలువైన భూమిని బోర్డు, ఆడిట్ కమిటీ లేదా షేర్హోల్డర్ల అనుమతి లేకుండా ఎస్సెల్ గ్రూప్ సంస్థల రుణాలకు తాకట్టు పెట్టినట్లు సెబీ విచారణలో తేలింది. దీంతో ఆ సంస్థపై, ఛైర్మన్, సిఇఒలపై కఠిన ఆంక్షలను ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురై జీ షేర్ల అమ్మకాలకు తెగబడటంతో సోమవారం ట్రేడింగ్లో జీ షేర్ 14.98 శాతం క్షీణించి రూ.98.15కు పరిమితమయ్యింది. జూబ్లీహిల్స్లో ఉన్న 17,639.64 చదరపు మీటర్ల స్థలాన్ని జీ ప్రమోటర్లకు చెందిన ఎస్సెల్ గ్రూప్లోని నాలుగు సంస్థలు డిసెంబర్ 2016లో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐహెచ్ఎఫ్ఎల్) నుండి రుణం తీసుకునేందుకు హామీగా ఉంచాయి. తదనంతరం ఎలాంటి ఆడిట్ కమిటీ, బోర్డు లేదా షేర్హోల్డర్ల అనుమతి లేకుండా సుభాష్ చంద్ర ఈ భూమికి సంబంధించిన ఒరిజినల్ టైటిల్ డీడ్లను డిసెంబర్ 2018లో తాకట్టుగా అప్పగించినట్లు సెబీ విచారణలో తేలింది. రూ.225 కోట్లు చెల్లించిన తర్వాత జూన్ 2020లో ఈ పత్రాలు వెనక్కి వచ్చాయి. అయితే నిబంధనల ఉల్లంఘనకు గాను జిఇఎల్పై రూ. 30 లక్షలు, సుభాష్ చంద్రపై రూ. 60 లక్షలు, పునీత్ గోయెంకాపై రూ. 58 లక్షల చొప్పున మొత్తం రూ. 1.48 కోట్ల జరిమానాను సెబీ విధించింది. మరోవైపు కంపెనీ చైర్మన్ ఎమెరిటస్ సుభాష్ చంద్ర, ఎండి, సిఇఒ పునీత్ గోయెంకాలపై ఏడాది పాటు సెక్యూరిటీ మార్కెట్లోకి వెళ్లకుండా కఠిన ఆంక్షలు జారీ చేసింది. ప్రమోటర్ల నుంచి రూ. 3,140 కోట్ల నిధుల సమీకరణకు షేర్హోల్డర్ల నుంచి ఆమోదం లభించినప్పటికీ.. సెబీ జారీ చేసిన తాజా ఆదేశాల కారణంగా మార్కెట్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రమో టర్లతో ముడిపడి ఉన్న ఎస్సెల్ గ్రూప్ సంస్థలు తీసుకున్న రుణాల కోసం హైదరాబాద్లోని కంపెనీ భూమిని అనధికారికంగా తాకట్టు పెట్టడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సెబీ తెలిపిం ది. సెబీ ఉత్తర్వుల ప్రభావం ఏ విధం గా ఉంటుందనే దానిపై స్పష్టత వచ్చే వరకు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవ హరించాలని, మార్కెట్లో నియం త్రణ పరమైన అనిశ్చితి తొలగిపోయే వరకు స్టాక్పై ఒత్తిడి కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
‘జీ’ అనధికారిక భూతాకట్టు
- Advertisement -
- Advertisement -



