చట్ట సవరణకు కేంద్రం ప్రతిపాదనలు
న్యూఢిల్లీ : యూపీఐ చెల్లింపులపై మళ్లీ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) విధించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ సవరణ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దీంతో బ్యాంక్లు, ఫిన్టెక్ సంస్థలకు వ్యాపారులు కొత్తగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం యుపిఐ లావాదేవీలపై వ్యాపారుల నుంచి ఎలాంటి ఎండిఆర్ వసూలు చేయడం లేదు. అయితే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నిర్వహణకు బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలకు స్థిరమైన ఆదాయం అవసరమనే డిమాండ్ నేపథ్యంలో ఈ మార్పులు తీసుకురానున్నారు. ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతిపాదన ప్రకారం వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్లకు పైగా ఉన్న వ్యాపారులు చేసే రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.3 శాతం నుంచి 0.5 శాతం వరకు ఎండిఆర్ విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. చిన్న వ్యాపారులు, వినియోగదారులకు మాత్రం మినహాయింపు ఉండే అవకాశాలు ఉన్నాయి.
జులైలో యుపిఐ ద్వారా 2360 కోట్ల లావాదేవీలు నమోదవగా, వాటి మొత్తం విలువ రూ.29.9 లక్షల కోట్లకు చేరింది. ఫోన్పే, గూగుల్ పే, పేటియం వంటి సంస్థలు యుపిఐ మార్కెట్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ అంచనా ప్రకారం రూ.2,000కు పైబడిన లావాదేవీలు మొత్తం సంఖ్యలో కేవలం 4 శాతం ఉన్నాయి. వాటి విలువ మొత్తం వ్యాపార చెల్లింపుల్లో 67 శాతం ఉంటుందని అంచనా. ప్రతిపాదిత ఎండిఆర్ అమల్లోకి వస్తే డిజిటల్ పేమెంట్స్ పరిశ్రమకు ఏటా రూ.5,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఛార్జీల శాతం, అమలు తేదీపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
యూపీఐ చెల్లింపులపై మళ్లీ మర్చంట్ చార్జీలు..?
- Advertisement -
- Advertisement -


