Sunday, March 29, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆనతినీయవా! ప్రభూ!

ఆనతినీయవా! ప్రభూ!

- Advertisement -

”నేను ఖమ్మం భారతమ్మ గారి దుకాణంలో నెలవారి సరుకులు కొనుక్కుంటాను. దయచేసి అనుమతి ఇవ్వగలరు. భవదియుడు-సీతారాం”. ఇది నిన్న ఫేస్‌బుక్‌లో కవి మిత్రుడు పెట్టిన సాదాసీదా పోస్టు. దీనికి లైక్‌కొడుతూ ”నేను కరుణ మెడికల్స్‌లో మందులు ఈ వారానికి కొనుక్కోవాలి. అనుమతించండి” అని కామెంట్‌ పెట్టాను.కొందరికి ఈ పోస్టు అంతరార్థం అర్థం కాలేదు.కొందరు ఇట్టే పసికట్టేసారు. 146కోట్ల ప్రజల ఆత్మగౌరవంపై ఎక్కుపెట్టిన అస్త్రం అది. ఒక దేశం పరువుకు సంబంధించిన సమస్య. ఇంతకన్న వ్యంగ్యంగా కవి ఏం వివరించగలడు! ఎంత బాధను అవేదనను కడుపులో దాచుకుంటే ఆ మాటలు పెల్లుబుకాయి.

ఇంతకన్న దీనంగా ఏం దేబు రించగలడు! జరుగుతున్న సంఘటనలు, పరిణామాలు, ఎవరినీ కదిలించడం లేదేమీ! మనుషులు, దేశ ప్రజలు, బుద్ధిజీవులు ప్రతిస్పందించడం మానుకున్నారా? నాకెందుకులే అని ఊరుకుంటున్నారా! ఇంతకన్న దారిద్య్రం ఏముంది! సిగ్గుపడేలా చేస్తున్న ఈ దిగజారుడుతనం తలవంపులు కలిగించడం లేదూ! తూటాలకు కూడా వెరవకుండా వందేమాతరం అంటూ మూడు రంగుల జెండాను పైకెగరేస్తూనే ప్రాణాలు వొదిలిన త్యాగధనుల నేల వారసత్వమేనా ఇంత దిగజారింది! స్వేచ్ఛ కోసం, స్వాతంత్య్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వీరులగన్న గడ్డ, ఆ పౌరుషత్వాన్ని ఎందుకు, ఎలా కోల్పోయింది. మాట్లాడితే యాభై ఆరించుల ఛాతీగల ధైర్యంగా చెప్పుకున్న వాళ్లు, గొంతులోంచి చిన్నమాటను ఉపయోగించడం లేదెందుకు! వాడు పబ్లిక్‌గానే రష్యాదగ్గర, ఇరాన్‌ దగ్గర చమురు కొనవద్దన్నప్పుడూ ఒక్కమాట పెగల్లేదు.

దానికి బదులుగా నా దగ్గరే కొనాలని హకుం జారీచేసినా, తల ఊపాం తప్ప, ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు యుద్ధ సందర్భంగా, ఒక నెలరోజులు మీకు వెసులుబాటు కలిపిస్తున్నాను.రష్యా దగ్గర కొనుక్కోండి అని నెలరోజుల స్వాతంత్య్రాన్ని ప్రకటించినపుడూ, డూడూ బసవన్నలా ఉపేసాం. మేము ఫలానా దేశం దగ్గర కొనుక్కుం టాము. మాకు అనుమతి ఇవ్వండి అనీ ఆర్జీ పెట్టుకోవడం ఏం తెలియజేస్తున్నది! మన డబ్బులు, మన స్వతంత్ర దేశం, సార్వభౌమ దేశం, ఎవరినుంచి కొనాలన్నా ట్రంపుగారి అనుమతి పొందాలి. ఈ సందర్భాన్ని కవి ఎంత సూటిగా, ముఖం మీద కొట్టినట్టు చెప్పాడు. అయిననూ మనవాళ్లకు చలనం కలిగిందా, ఏమో!

రవి అస్తమించని సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించి తరిమికొట్టిన అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, కొమురంభీమ్‌, ఆజాద్‌ చంద్రశేఖర్‌ లాంటి యోధానుయోధుల వీరచరితగల దేశం అమెరికా ఆజ్ఞలకు తలవంచడం, మనదేశ స్వాతంత్య్ర సార్వభౌమత్వాలను కోల్పోవడం కాదా! ప్రజలు, ప్రాంతాలు, జాతులు, మతాలు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ, వైవిధ్యాలతో కొనసాగినప్పటికీ స్వేచ్ఛ కోసం పోరాడుతుంటే, వారికి కూడా సంఘీభావంగా నిలిచి, మద్దతు ప్రకటించిన అలీన ఉద్యమాన్ని నడిపిన, నాయకత్వం వహించిన దేశంగా పేరు పొందిన వాళ్లం మనం. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్‌, అంతర్జాతీయ చట్టాలకు, న్యాయసూత్రాలకు వ్యతిరేకంగా ఇరాన్‌పై దాడులు చేస్తుంటే, ఇది సరికాదు, అని చెప్పలేకపోయాం. కనీసం మనకు ఎప్పటినుంచో స్నేహితుడు అయిన ఇరాన్‌ నేతను హత్యచేస్తే, ఖండించడం అటుంచి, సంతాపమూ వెంటనే ప్రకటించలేని అసహాయ, అమానవీయస్థితికి దిగజారిపోయాం.

165 మంది చిన్నపిల్లలను అతి దారుణంగా బాంబులేసి చంపేసినా చలించకపోవడం, ఖండించకపోవడం ఎంత అన్యాయం! రెండు వందల యేండ్లు సామ్రాజ్యవాదంతో పోరాడిన వారసత్వం, నేడు ప్రపంచాన్ని యుద్ధ బీభత్సంలోకి దింపిన సామ్రాజ్యవాద అమెరికాకు సాగిలపడటం ప్రభుత్వ వైఫల్యానికి, లొంగుబాటుకు నిదర్శనం. ఎందుకీ లొంగుబాటు! ఈ నాయకుల రహస్య చిట్టాలేమయినా ట్రంపు తన చేతిలో పెట్టుకుని ఉన్నాడా! ఎఫ్‌స్టీన్‌ ఫైల్స్‌లోని నిజా నిజాలు ఇంకా బయటపడాల్సి ఉంది. ‘హతులెవరో తెలుసు, హంతకులెవరో తెలుసు, అయినా, అన్యాయం అని అనకపోవడమే అసలు నేరం! కదా! అపార దేశ భక్తిగల వాళ్లు మనల్ని పరిపాలిస్తున్నారని ప్రజలు భ్రమపడుతున్నారు. దేశాన్ని నిర్లజ్జగా అగ్రరాజ్య ఆజ్ఞలకు తలొగ్గడం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇంతటి వెన్నెముక లేని దేశంగా గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పటికయినా ప్రజలు అప్రమత్తమయి, ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిస్పందించాల్సి ఉంది. లేదంటే స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కోల్పోతాము.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -