- కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. విద్యార్థుల ఉద్యమానికి సంబంధించిన ప్రతి అంశంపైనా చర్చించేందుకు కేంద్రం సిద్ధమేనని ఆయన సోమవారం తెలిపారు. అయితే, సభా కార్యక్రమాలను అడ్డుకునేలా విపక్షాలు హంగామా చేయకూడదని స్పష్టం చేశారు.
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనకానుంచి ప్రతిపక్షాలు ఏకతాటిపై నిలిచాయి. జూలై 20న నీట్ పేపర్ లీక్ ను వ్యతిరేకిస్తూ సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పార్లమెంట్ వైపుగా సాగుతున్న విద్యార్థుల శాంతి యుత నిరసనలపై ఒక్కసారిగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీలో విద్యార్థులపై టియర్ గ్యాస్, మేకులు అమర్చిన లాఠీలతో దాడి, పెల్లెట్ గన్స్ ప్రయోగించారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఘటనపై సమగ్రంగా ఉభయ సభల్లో చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. ఎట్టకేలకు దిగొచ్చిన మోడీ ప్రభుత్వం చర్చకు అంగీకరించింది.కేంద్ర మంత్రి తాజా ప్రకటనతో పార్లమెంట్లో ఎలాంటి వాడీవేడి చర్చ జరగనుందోననే ఆసక్తి నెలకొంది.



