– ఆయిల్ పామ్ సాగుపై అవగాహన
– సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో ముందడుగు
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ రైతులను అశ్వారావుపేట లో సాగు అవుతున్న ఆయిల్ మామ్ అధ్యయన యాత్రకు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ లో భాగంగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుంది అని ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు.
కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిపాదిత ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి రైతులకు ప్రాయోజిత అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే ఆయిల్ పామ్ సాగులో ముందంజలో ఉన్న అశ్వారావుపేట ప్రాంతంలో రైతులు తోటల నిర్వహణ, సాగు పద్ధతులు, దిగుబడులు మరియు మార్కెట్ అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు.
రైతుల ఆదాయం పెంపుతో పాటు పరిశ్రమల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. గతంలో కంటే పామ్ ఆయిల్ సాగు రెట్టింపు చేసామని,సాగుకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.అతి త్వరలో ఖమ్మం జిల్లా,వేంసూరు మండలం కల్లూరి గూడెం లో నిర్మిస్తున్న పరిశ్రమ ను ప్రారంభిస్తామని,అదే క్రమంలో అశ్వారావుపేట లో మరో నూతన పరిశ్రమ ను నిర్మాణ పనులు మొదలు పెడతామని అన్నారు.
కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ (కేఏడీఏ) చైర్మన్ వెంకట్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఓఎస్డీ అడపా కిరణ్ కుమార్, ఆయిల్ ఫెడ్ ఓపీడీ మేనేజర్ ప్రవీణ్ రెడ్డి,జిల్లా మేనేజర్ శబావత్ శంకర్ లు రైతులకు పలు సూచనలు చేశారు. కొడంగల్, నారాయణపేట ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొడంగల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల రైతులకు స్థిరమైన మార్కెట్తో పాటు మెరుగైన ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.





