డైరెక్టర్ ఆఫ్ సెన్సన్స్ భారతి హోలీ కేరి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోళీకేరి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా జనగణన అధికారులతో జనగణన, ఇండ్ల గణన ప్రక్రియలు, మ్యాప్ తయారీ, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ మాట్లాడుతూ జనగణన కార్యక్రమంలో భాగంగా ఇండ్ల గణన ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని, ప్రక్రియ నిర్వహణ, సాంకేతికత వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గణన చేయాలని తెలిపారు.
దేశంలోనే తొలిసారిగా జనగణనను పూర్తిగా డిజిటల్ పద్ధతి ద్వారా చేపట్టడం జరుగుతుందని, మే 11వ తేదీ నుండి జూన్ 9వ తేదీ వరకు జనగణనలో భాగంగా ఇండ్ల గణన కార్యక్రమం కొనసాగుతుందని, కుటుంబాల వివరాలు పూర్తిగా నమోదు చేయబడతాయని, సన్నాహక పనులు మొదలు పెట్టాలని తెలిపారు. యాప్ నిర్వహణలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించి ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. చార్జెస్ (మండలాల) వారీగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం చేపట్టాలని, 300 ఇళ్లకు / 750-800 జనాభాకు ఒక ఎన్యుమరేటర్ ను నియమించాలని, ఎన్యుమరేటర్ బ్లాక్/ హౌస్ లిస్టింగ్ బ్లాక్ తయారు చేయాలని, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ జిల్లాలో జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన విధులు అధికారులు, సిబ్బంది సమన్వయంతో సక్రమంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా మొదటి విడత ఇండ్ల గణన ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి జయమ్మ, ముఖ్య ప్రణాళిక అధికారి, జిల్లా జనగణన అధికారి వెంకటరమణ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



