దానికోసం విధివిధానాల రూపకల్పన
ధాన్యం నిల్వల కోసం
ఐదు నియోజకవర్గాల్లో సైలో బ్యాగ్ నిర్మాణాలు
పౌరసరఫరాల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మిల్లర్లు బకాయిపడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నడిపే వారితో సానుకూలంగా ఉంటామని, ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించే వారితో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో పౌరసరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితో కలిసి సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వేల కోట్ల బకాయిలకు అవకాశం ఇచ్చి, తిరిగి ఆ తప్పిదాన్ని తమ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే బకాయిల వసూళ్లలో కొంత పురోగతి ఉందని, అయితే ప్రతి ధాన్యం గింజకు చెందిన బకాయిని వసూలు చేయాల్సిందేనన్నారు. వసూళ్లకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత నివేదికను మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మొండి బకాయిదారులుగా మారిన మిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని మహిళా సంఘాలకు కేటాయించి మిల్లింగ్ బాధ్యతలను ఆయా సంఘాలకే అప్పగిస్తామని తెలిపారు.
ప్రతీ సీజన్లో ధాన్యం నిల్వలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే తగు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. ధాన్యం భారీగా వచ్చే నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో సైలో బ్యాగ్ నిర్మాణాలను పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టాలని ఆదేశించారు. వాటి నిర్మాణాలకు స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ ) ఆధ్వర్యంలో నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాల భూమిని కేటాయిస్తామని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ, పౌరసరఫరాలు, మహిళా సంక్షేమ శాఖల మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీబీ గ్రామ్జీలో ఫ్లాట్పాంల నిర్మాణానికి అవకాశం ఉన్న నేపథ్యంలో విశాలమైన ఫ్లాట్పాంలు నిర్మించటంతోపాటు జర్మన్ టెంట్లతో ధాన్యం నిల్వకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. మండల, గ్రామ స్థాయిలో ఉన్న ప్రయివేటు గోదాములు, ధాన్యం నిల్వలకు ఉపయోపపడే కల్యాణ మండపాలు, పాత థియేటర్లు, ఇతర షెడ్లను ముందుగానే గుర్తించి లీజుకు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, పౌరసరఫరాల సంస్థ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సౌత్ ఇండియా రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తూడి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



