Thursday, August 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఖర్గే సభ జరిగిన చోట ‘శుద్ధి’.. రాజ్యసభలో రగడ

ఖర్గే సభ జరిగిన చోట ‘శుద్ధి’.. రాజ్యసభలో రగడ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ నిర్వహించిన ప్రదేశంలో ‘శుద్ధీకరణ’ పేరుతో హోమం చేయడం రాజకీయ దుమారం రేపింది. ఈ అంశం గురువారం రాజ్యసభను కుదిపేసింది. ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. బీజేపీ ఇలాంటి చర్యలను సమర్థించదని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రామ్‌లీలా మైదానంలో ఆగస్టు 8న ఖర్గే ‘విజయ శంఖనాద’ సభ నిర్వహించారు. రెండు రోజుల తర్వాత శ్రీరామ్‌ సేనకు చెందిన కార్యకర్తలు అక్కడ హోమం చేసి వేదికను ‘శుద్ధి’ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది.

రాజ్యసభలో ఖర్గే మాట్లాడుతూ.. తన సభకు లక్షలాది మంది హాజరయ్యారని చెప్పారు. తాను ఏ మతం లేదా వర్గం గురించి మాట్లాడలేదన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనే మాట్లాడానని తెలిపారు. అయినా తన ప్రసంగం తర్వాత వేదికకు శుద్ధి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతేనా? రాజ్యాంగాన్ని ఎలా కాపాడుతున్నారని నిలదీశారు. ఈ ఘటనను ఖండించిన రాజ్యసభ ఛైర్మన్‌.. అంటరానితనం కంటే పెద్ద పాపం మరొకటి లేదని వ్యాఖ్యానించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -