Thursday, April 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికన్‌ జర్నలిస్ట్‌ కిడ్నాప్‌

అమెరికన్‌ జర్నలిస్ట్‌ కిడ్నాప్‌

- Advertisement -

ఇరాక్‌లోని బాగ్దాద్‌లో అపహరణ
కొనసాగుతున్న గాలింపు చర్యలు
బాగ్దాద్‌:
ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఓ అమెరికన్‌ జర్నలిస్టు కిడ్నాప్‌నకు గురయ్యారు. ఆమెను అపహరించుకుపోయిన వారి కోసం ఇరాక్‌ భద్రతా దళాలు గాలిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ అపహరణకు ఇరాన్‌ మద్దతు ఉన్న ఇరాకీ మిలీషియా కతైబ్‌ హిజ్బుల్లానే కారణమని ఒక అమెరికా అధికారి ఆరోపించారు. అయితే విదేశీ జర్నలిస్టు అపహరణకు గురైనట్టు ఇరాక్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. కానీ వివరాలు వెల్లడించలేదు. ఈ కేసు గురించి బహిరంగంగా మాట్లాడే అధికారం లేనందున తమ పేర్లు వెల్లడించొద్దనే షరతుపై ఇద్దరు ఇరాక్‌ భద్రతా అధికారులు, అపహరణకు గురైన జర్నలిస్టు ఒక మహిళ అని, ఆమె అమెరికా పౌరురాలని తెలిపారు. ఈ అపహరణలో రెండు కార్లు పాల్గొన్నాయని, వాటిలో ఒకటి బాగ్దాద్‌కు నైరుతి దిశలో ఉన్న బాబిల్‌ ప్రావిన్స్‌లోని అల్‌-హస్వా పట్టణం సమీపంలో వెంబడిస్తుండగా ప్రమాదానికి గురైందని చెప్పారు. ఆ తర్వాత ఆ జర్నలిస్టును రెండవ కారులోకి మార్చి అక్కడి నుంచి పారిపోయేలా చేశారని, కిడ్నాపర్ల జాడను తెలుసుకోవడానికి భద్రతా దళాలు ఒక ఆపరేషన్‌ ప్రారంభించాయని తెలిపారు. కిడ్నాపర్లు పారిపోవడానికి యత్నిస్తుండగా బోల్తా పడిన వారికి చెందిన వాహనాన్ని అడ్డగించారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో ఒక అనుమానితుడిని అరెస్టు చేశారని, కిడ్నాప్‌లో ఉపయోగించిన వాహనాల్లో ఒకదాన్ని స్వాధీనం చేసుకున్నారని, అయితే ఇతరులు ఇంకా పరారీలోనే ఉన్నారని పేర్కొంది. సెంట్రల్‌ బాగ్దాద్‌లోని సాదూన్‌ వీధిలో జర్నలిస్టును అపహరించారని, అన్ని చెక్‌ పాయింట్‌లకు హెచ్చరిక జారీ చేయడంతో, కిడ్నాపర్లు బాబిల్‌ ప్రావిన్స్‌ వైపు వెళ్తుండగా వారిని వెంబడించినట్టు ఇద్దరు ఇరాక్‌ భద్రతా అధికారులు తెలిపారు. పశ్చిమాసియా వార్తలను అందించే ప్రాంతీయ వార్తా సంస్థ ‘అల్‌-మానిటర్‌’ ఈ ఘటనపై ‘తీవ్ర ఆందోళన’ వ్యక్తం చేసింది. ఆ జర్నలిస్టు తమ పత్రికకు ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్న కిటిల్సన్‌గా గుర్తించింది. ”ఆమెను సురక్షితంగా, తక్షణమే విడుదల చేయాలని మేము కోరుతున్నాం’ అని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -