టీఎస్పీజేఏ రాష్ర్ట కమిటీ
హైదరాబాద్కు చెందిన డెక్కన్ క్రానికల్ ఫొటోగ్రాఫర్
కే.దుర్గారావుకు మొదటి బహుమతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్త ఫొటోగ్రఫీ పోటీలు-2026 విజేతలను తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం (టీఎస్పీజేఏ) ప్రకటించింది. ఆదివారం హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనుమళ్ల గంగాధర్, కెఎన్.హరి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని ఫొటో జర్నలిస్టుల నైఫుణ్యాన్ని పెంచడంతోపాటు వారిని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్త ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 102 ఎంట్రీలు (306 ఛాయాచిత్రాలు) వచ్చాయని తెలిపారు. జ్యూరీ సభ్యులైన ప్రముఖ సంపాదకులు దేవులపల్లి అమర్, ప్రముఖ ఛాయాచిత్రగ్రాహకులు కొమ్మిడి విశ్వేందర్ రెడ్డి, కమలా సుధాకర్ రెడ్డి వాటిని పరిశీలించి ఉత్తమ ఛాయాచిత్రాలను ఎంపిక చేశారని తెలిపారు. హైదరాబాద్కు చెందిన డెక్కన్ క్రానికల్ ఫొటోగ్రాఫర్ కే.దుర్గారావుకు ప్రథమ బహుమతి (రూ.10,000), నల్లగొండ సాక్షి ఫొటోగ్రాఫర్ కే.బజరంగ్కు ద్వితీయ బహుమతి (రూ.7000), సంగారెడ్డి ఈనాడు ఫొటోగ్రాఫర్ పొన్న శ్రీనివాస్కు తృతియ బహుమతి (రూ.5,000) గెలుచుకున్నారని వివరించారు. డి. సుమన్ రెడ్డి (టైమ్స్ అఫ్ ఇండియా, హైదరాబాద్), ఆవుల శ్రీనివాస్ (ఈనాడు, హైదరాబాద్), కె. రమేష్ (మన తెలంగాణ, వరంగల్), పిట్టల శ్రీధర్ (ప్రజాపక్షం, కరీంనగర్), కుంట్ల శ్రీనివాస్ (ఫ్రీలాన్స్ , హైదరాబాద్), ఏం. నాగేశ్వర్ రావు (ఆంధ్రజ్యోతి, హైదరాబాద్), జె. నవీన్ (వెలుగు, హైదరాబాద్), ఆర్. రాఘవేందర్ (ఈనాడు, హైదరాబాద్), ఏం. గోపి కృష్ణ (నమస్తే తెలంగాణ, హైదరాబాద్ ), జి. శ్రావణ్ కుమార్ (నమస్తే తెలంగాణ, హైదరాబాద్)లకు రూ.1,000 చొప్పున కన్సొలేషన్ బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. ఈనెల 19న హైదరాబాద్లోని బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్లో రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్త చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. త్వరలో విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తామని వారు తెలిపారు.



