- టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసుపై మంత్రి కొండా సురేఖ స్పందన
నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసుపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికి రాసిన లేఖలో తన వివరణ ఇచ్చారు. ఇటీవల తన కుమార్తె కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని సురేఖ స్పష్టం చేశారు. కుటుంబ బంధాల కారణంగా ఒకరు చేసిన వ్యాఖ్యలకు మరొకరిని రాజకీయంగా బాధ్యులను చేయడం సరికాదని, కుమార్తె అభిప్రాయాలకు తనను బాధ్యురాలిని చేయడం న్యాయసూత్రాలకు విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, అధిష్ఠానం నిర్ణయాలు , పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదనే విషయాన్ని క్రమశిక్షణ కమిటీ గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తన ప్రమేయం లేని అంశంలో జారీ చేసిన ఈ నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని కమిటీని కోరారు.



