నవతెలంగాణ – అశ్వారావుపేట
సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యుడు కామ్రేడ్ సురవరం సుధాకర్రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా సీపీఐ అశ్వారావుపేట మండల సమితి ఆధ్వర్యంలో శనివారం నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సయ్యద్ సలీం మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ కష్టజీవులు, పేదలు, కార్మికులు, రైతుల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు సురవరం సుధాకర్రెడ్డి అని అన్నారు.ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. సాధారణ జీవనశైలితో, విలువలకు కట్టుబడి పనిచేసిన సుధాకర్రెడ్డి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని కమ్యూనిస్టులు అభ్యుదయ భావాలతో ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
సురవరం సుధాకర్రెడ్డి 2025 ఆగస్టు 22న అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందారు. 83 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఆయన విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాలతో అనుబంధం పెంచుకుని కమ్యూనిస్టు ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించడంతో పాటు 1998 నుంచి 2004 వరకు నల్లగొండ పార్లమెంట్ సభ్యుడిగా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 2012 నుంచి 2018 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి నాయకత్వం వహించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు గన్నిన రామకృష్ణ, చీపుర్ల సత్యవతి, సీపీఐ నాయకులు దిల్షాద్, శ్రావణి, వాసు, వెంకన్న, ప్రసాద్, రామకృష్ణ, రూతు తదితరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.



