నవతెలంగాణ-హైదరాబాద్: సిక్కింలో విషాదం నెలకొంది. లాచెన్ జిల్లాలోచటెన్ వద్ద కొండచరియలు విరిగిపడి ముగ్గురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో ఆరుగురి ఆచూకీ లభించకపోవడంతో వారికోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మృతులు హవల్దార్ లఖ్బిందర్ సింగ్, లాన్స్ నాయక్ మ్నిష్ ఠాకూర్, పోర్టర్ అభిషేక్ లఖాడ మృతదేహాలను వెలికితీశారు. తప్పిపోయిన ఆరుగురు సిబ్బందిని గుర్తించి రక్షించడానికి రెస్క్యూ బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని రక్షణ శాఖ సహాయ మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి పలువురు మృతి చెందారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయి.. రాకపోకలు నిలిచిపోయాయి. వరద బాధితులను ఆదుకోవడానికి భారత ఆర్మీ, వైమానిక దళం, అస్సాం రైఫిల్స్ రంగంలోకి దిగి సహాయక చేర్యలు చేపట్టి వందలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈక్రమంలో సిక్కింలోని చెటన్ ప్రాంతాంలో సహాయక చర్యల్లో పాల్గొన్న జవాన్లపై కొండచరియలు విరిగిపడ్డాయి.