నవతెలంగాణ – సిర్పూర్ (టి ): భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మండలంలోని పలు గ్రామాలలో, మండల కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతం, జై భీమ్ నగర్ ప్రాంతాల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నాయకులు మాట్లాడుతూ.. బహుజన సమాజ అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన అంబేద్కర్ ఆశయాలను నేటి యువత ముందుండి కొనసాగించాలని పిలుపునిచ్చారు. సమాజంలో అణగారిన వర్గాలు ఎదుర్కొన్న అన్యాయాలను తొలగించేందుకు ఆయన చేసిన పోరాటం అపూర్వమని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాముఖ్యత వంటి విలువలను సమాజానికి అందించిన మహానీయుడిగా అంబేద్కర్ను అభివర్ణించారు.
ఆధునిక సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమసమాజ స్థాపనకు కృషి చేయాలని సూచించారు. ఆయన ఆశయాలను కేవలం జయంతులకే పరిమితం చేయకుండా నిత్యజీవితంలో ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో పలువురు నాయకులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



