నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కేసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో బీహార్కు చెందిన నందులాల్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న నందులాల్ను సందీప్ తన కారుతో అతివేగంగా ఢీకొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన జైద్ షా ఖాద్రీ అనే విద్యార్థి, క్షతగాత్రుడైన నందులాల్ను తన కారులో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించాడు.
అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో మహీంద్రా కారు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ రెండో ప్రమాదంలో మరింత తీవ్రంగా గాయపడిన నందులాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన మహీంద్రా కారు ఆపకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక నిపుణుల సహాయంతో ప్రమాదానికి కారణమైన రెండు వాహనాలను గుర్తించారు. అనంతరం రెండు కార్లను స్వాధీనం చేసుకుని, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని విచారించిన తర్వాత ఆయన కుమారుడు సందీప్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.



