నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలోని అమరావతిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 180 మందికి పైగా మైనర్ బాలికలను లైంగికంగా దాడి చేసి, 350కి పైగా అశ్లీల వీడియోలు చిత్రీకరించిన కేసులో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ చేసిన ఫిర్యాదుతో పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే… పరాత్వాడ నగరానికి చెందిన మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అనే వ్యక్తి మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకున్నాడు. వాట్సాప్, స్నాప్చాట్ గ్రూపుల ద్వారా బాలికలకు ప్రేమ పేరుతో వల వేసేవాడు. వారిని నమ్మించి ముంబై, పుణె వంటి నగరాలకు తీసుకెళ్లి అశ్లీల వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని బాలికలను బ్లాక్మెయిల్ చేస్తూ, బలవంతంగా వ్యభిచారంలోకి దింపినట్లు తెలుస్తోంది. కొన్ని వీడియోలను ఆన్లైన్లో కూడా షేర్ చేసినట్లు సమాచారం. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అయాజ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. అతని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులో అనేక అభ్యంతరకర వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ వీడియోలను స్నేహితులకు గానీ, మరేదైనా ముఠాకు గానీ షేర్ చేశాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



