నవతెలంగాణ-హైదరాబాద్ : నేపాల్లో జల ప్రళయం సృష్టించిన మహా విషాదంలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. వరదలు ముంచెత్తిన తొమ్మిది రోజుల తర్వాత, బురద, శిథిలాలతో పూర్తిగా కూరుకుపోయిన ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం నుంచి ఇద్దరు కార్మికులను సహాయక సిబ్బంది సజీవంగా బయటకు తీశారు. ఈ ఘటనతో ఇంకా అనేక సొరంగాల్లో చిక్కుకుపోయిన వందలాది మంది కార్మికులు కూడా ప్రాణాలతో బయటపడతారనే ఆశలు బలపడ్డాయి.
నేపాల్లోని త్రిశూలి 3A జల విద్యుత్ ప్రాజెక్టులో ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇద్దరిని ప్రాణాలతో కాపాడటం అక్కడివారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బురదతో నిండిపోయిన కార్మికులను సహాయక సిబ్బంది తమ భుజాలపై మోసుకుని బయటకు తీసుకువస్తున్న దృశ్యాలు స్థానిక టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక వీడియోలో, కార్మికుడిని సొరంగం నుంచి బయటకు తీయగానే సహాయక సిబ్బంది ఆనందంతో కేరింతలు కొట్టడం కనిపించింది. మరో చిత్రంలో, బురదలో కూరుకుపోయిన మరో వ్యక్తిని స్ట్రెచర్పై తరలిస్తుండగా, అతను చేతులు జోడించి నమస్కరించడం హృదయాలను కదిలించింది.
వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..
సహాయక చర్యల్లో ప్రాణాలతో బయటపడిన వారిని నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (ఎన్ఈఏ) మెకానికల్ ఫోర్మెన్ సంజయ్ షా (30), త్రిశూలి-3 ‘A’ ప్రాజెక్ట్ సూపర్వైజర్ కబీర్ మహర్జన్ (45)గా నేపాల్ హోం మంత్రి సుడాన్ గురుంగ్ గుర్తించారు. ‘బీబీసీ’ కథనం ప్రకారం.. సంజయ్ షా మాట్లాడలేని స్థితిలో ఉండటంతో అతన్ని వెంటనే హెలికాప్టర్లో రాజధాని ఖాట్మండుకు సమీపంలోని బత్తర్కు తరలించారు. మరోవైపు, కబీర్ మహర్జన్ స్పృహలోనే ఉన్నాడని, అతన్ని ఖాట్మండులోని చౌనీ మిలటరీ ఆసుపత్రికి తరలిస్తున్నామని అతని భార్య తెలిపారు. “చాలా సంతోషంగా ఉంది, నా గుండెపై భారం తగ్గింది” అని కబీర్ సోదరుడు అమీర్ మహర్జన్ ఆనందం వ్యక్తం చేశారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
హిమానీనదం కూలిపోవడం వల్ల సంభవించిన ఈ జల ప్రళయంలో నేపాల్లోని మూడు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 1,259 మంది మరణించగా, 5,000 మందికి పైగా గల్లంతయ్యారని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. సరిహద్దుకు ఆవలి వైపున ఉన్న టిబెట్లో 21 మంది చనిపోగా, 541 మంది గల్లంతైనట్లు చైనా ప్రకటించింది.
నేపాల్లోని 12 జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి దాదాపు 900 మంది కార్మికులు గల్లంతయ్యారని, వారిలో సుమారు 500 మంది సొరంగాల్లోనే చిక్కుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆరు హైడ్రోపవర్ ప్రాజెక్టుల సొరంగాల్లో 150 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నట్లు భావిస్తుండటంతో, వారిని కాపాడేందుకు భారీ ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగాల్లోకి గాలిని పంపింగ్ చేస్తూ కార్మికులను ప్రాణాలతో కాపాడేందుకు ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తాజా ఘటన జరిగిన త్రిశూలి సొరంగం నుంచి మరిన్ని స్వరాలు వినిపిస్తున్నాయని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. “మరింత మందిని కాపాడుతామని ఆశిస్తున్నాం. వారి కోసం ఎదురుచూస్తున్నాం” అని నేపాల్ కమ్యూనికేషన్ మంత్రి బిక్రమ్ తిమిల్సినా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనతో గల్లంతైన వారి కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి.



