జాయింట్ కలెక్టర్ డేవిడ్
నవతెలంగాణ – సిర్పూర్ (టి)
రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని జాయింట్ కలెక్టర్ డేవిడ్ సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం రైతుల నుంచి వరి కొనుగోలు జరుగుతుందని, దళారులను నమ్మి ధాన్యం అమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు.
గురువారం మండలంలోని టోంకిని మరియు దుబ్బగూడా ఏర్పాటు చేయబోవు వరి కొనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రస్తుత సీజన్లో పంట పరిస్థితి, ధాన్యం ఎప్పుడు కేంద్రాలకు చేరుకుంటుందనే అంశాలపై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కమిటీ సభ్యులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం మహేష్, సీసీలు, వివో కమిటీ సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు.



