నవతెలంగాణ- కాటారం
ఈనెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం ముందుగా మేడిగడ్డ కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించి, అనంతరం కాటారం మండలం నస్తూరుపల్లిలో రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
ఈ నేపథ్యంలో అన్ని శాఖలు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. నస్తూరుపల్లి బహిరంగ సభకు విచ్చేసే ప్రజలకు తాగునీరు, మజ్జిగ వంటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సభా ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్ర వాతావరణం కల్పించాలని డీపీవోకు సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
హెలిప్యాడ్, అప్రోచ్ రోడ్ల అభివృద్ధి, బారికేడింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచనలు ఇచ్చారు. అలాగే సభా ప్రాంగణంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రాంతాల్లో లైటింగ్, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని వైద్య శాఖకు ఆదేశించారు. అగ్నిమాపక వాహనాలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. కాళేశ్వర దేవాలయం పరిసరాల్లో విద్యుద్దీకరణ పనులు పూర్తి చేయాలని ఈఓను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖలు తమ విధులపై ధ్రువీకరణ నివేదికలు సమర్పించాలని తెలిపారు. అలాగే ఏప్రిల్ 19, 20 తేదీల్లో ఇసుక లారీల రాకపోకలను నిలిపివేయాలని సూచించారు. విధులు నిర్వర్తించే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కలెక్టరేట్ ఏవోకు ఆదేశించారు.
అంతకుముందు అధికారులు కాలేశ్వరం, నస్తూరుపల్లిలో హెలిప్యాడ్ పనులను పరిశీలించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీవో హరికృష్ణ, డీఎస్పీ సూర్యనారాయణతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.



