నవతెలంగాణ-రాయికల్
పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్లో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్యేక అధికారి, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి గౌతమ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతిపై సమగ్రంగా చర్చించారు.
ముఖ్యంగా రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, మహాలక్ష్మి, గృహజ్యోతి, సన్న రకం వారికి బోనస్, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, రేషన్ కార్డులు వంటి పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలను సమీక్షించారు. పథకాలు అర్హులైన వారికి సమయానికి అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బింగి చిరంజీవి, తహసిల్దార్ నాగార్జున, ఎంపీఓ సుష్మ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



