– నామక్కల్లో నల్లజెండాలు..నల్లదుస్తులు ధరించి
తమిళనాడు సీఎం స్టాలిన్ నిరసన
చెన్నై : డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిరసన వ్యక్తం చేశారు. గురువారం నామక్కల్లో నల్లజెండాలు ఎగరవేసిన అనంతరం నల్లదుస్తులు ధరించి డీలిమిటేషన్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ ”ఈ నిరసన బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోస్తుంది. ప్రతిఘటన జ్వాల తమిళనాడు అంతటా వ్యాపించనివ్వండి. ఇది పచ్చి మితవాద బీజేపీ అహంకారాన్ని కూలదోయాలి” అని మండిపడ్డారు. 1950, 1960ల్లో చేపట్టిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని గుర్తు చేశారు. డీలిమిటేషన్ నిరసనను హిందీ వ్యతిరేక ఉద్యమంతో పోల్చారు. ”అప్పుడు తమిళనాడుపై హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన ప్రతిఘటన జ్వాల ఢిల్లీని దహించి వేసింది. తమిళనాడు నిరసనలకు ఢిల్లీ తలొగ్గింది. ఇప్పుడు సొంతగడ్డపైనే తమిళులను శరణార్థులుగా మార్చాలని చూస్తున్న ఈ బిల్లు ప్రతులను తగలబెట్టి ఆ జ్వాలను మళ్లీ రగిలించాలి. ఈ జ్వాల ద్రవిడ భూమి అంతటా వ్యాపించి, బీజేపీ అహంకారాన్ని మోకరింపజేస్తుంది” అని అన్నారు.దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని గణనీయంగా తగ్గించనున్న డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపాలని స్టాలిన్ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మూడురోజుల పాటు నివాసాల్లో, వాణిజ్య సంస్థల్లో నల్ల జెండాలు ఎగరవేయాలని కోరారు.
బిల్లు ప్రతుల దహనం
- Advertisement -
- Advertisement -



