తొలి ఇన్నింగ్స్ 242/6
నిప్పులు చెరిగిన షమి, ముకేశ్ కుమార్
దులీప్ ట్రోఫీ ఫైనల్
నవతెలంగాణ-చెన్నై
దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. బౌలర్లు నిరాశపరచగా తొలుత ఈస్ట్ జోన్ 708 పరుగుల భారీ స్కోరు చేయగా.. తాజాగా బ్యాటర్లు సైతం సౌత్జోన్ను వెనక్కి నెట్టారు. ఈస్ట్ పేసర్లు మహ్మద్ షమి (2/17), ముకేశ్ కుమార్ (2/36) నిప్పులు చెరగటంతో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరుకే పరిమితమయ్యే ప్రమాదంలో పడింది. మూడో రోజు ఆట ముగిసేసరికి సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 80 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసింది. తెలంగాణ ప్లేయర్లు కెప్టెన్ తిలక్ వర్మ (56 నాటౌట్, 133 బంతుల్లో 5 ఫోర్లు), సీవీ మిలింద్ (26 నాటౌట్, 79 బంతుల్లో 1 ఫోర్) అజేయ ఇన్నింగ్స్లతో పోరాడుతున్నారు. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో మరో 466 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది.
మెరిసిన ఈస్ట్ బౌలర్లు
కెరీర్ వందో ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో సీనియర్ పేసర్ మహ్మద్ షమి అదరగొట్టాడు. ఆంధ్ర యువ బ్యాటర్ షేక్ రషీద్ (27, 48 బంతుల్లో 5 ఫోర్లు), రవిచంద్రన్ స్మరణ్ (23, 55 బంతుల్లో 1 ఫోర్) వికెట్లతో సౌత్జోన్ను దెబ్బకొట్టాడు. మరో పేసర్ ముకేశ్ కుమార్ సైతం మెరవటంతో.. సౌత్కు ఇక్కట్లు తప్పలేదు. ఓపెనర్ రికీ భుయ్ (1), దేవదత్ పడిక్కల్ (62, 104 బంతుల్లో 4 ఫోర్లు) వికెట్లు పడగొట్టిన ముకేశ్ కుమార్ ఈస్ట్ జోన్ పట్టు సడలకుండా చూశాడు. సౌత్ జోన్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. కానీ నారాయణ్ జగదీశన్ (32, 42 బంతుల్లో 6 ఫోర్లు), దేవదత్ పడిక్కల్లు రెండో వికెట్కు 60 పరుగులు జోడించారు. అర్థ సెంచరీ తర్వాత పడిక్కల్ నిష్ర్కమించగా మిడిల్ ఆర్డర్ ప్రతిఘటన చూపించలేదు. కెప్టెన్ తిలక్ వర్మ (56 నాటౌట్) అజేయ అర్థ సెంచరీతో క్రీజులో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. శ్రేయాస్ గోపాల్ (26) అవుటైన తర్వాత తిలక్ వర్మతో జతకలిసిన మరో హైదరాబాదీ సీవీ మిలింద్ మూడో రోజు ఆటలో మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహించాడు. అంతకుముందు, ఇషాన్ కిషన్ (270), కుమార్ కుశాగ్ర (101), శిఖర్ మోహన్ (85), అభిమన్య ఈశ్వరన్ (72) మెరుపులతో ఈస్ట్ జోన్ 163 ఓవర్లలో 708 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.



