– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యార్థుల మెనూ చార్జీలను రూ.25 కు పెంచాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వంట బిల్లులు,గుడ్ల బిల్లులు,వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. బుధవారం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న కార్మికులు వంట సామగ్రి కొనుగోలుకు వేలాది రూపాయలు అప్పులు చేసి ఏజెన్సీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సకాలంలో వంట బిల్లులు, గుడ్ల బిల్లులు, వేతనాలు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ మెనూ చార్జీలు పెంచకుండా మెనూ అమలు చేయాలని మండలస్థాయి అధికారులు కార్మికులపై ఒత్తిడి తేవడం సమంజసం కాదన్నారు.
ఎన్నికల హామీ మేరకు మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను రూ.10 వేలకు పెంచి అమలు చేయాలని, గ్యాస్, గుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు, వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల మండల నాయకులు యామిని, సీత, వెంకటలక్ష్మి, పద్మ, శారమ్మ, పార్వతి, విజయ తదితరులు పాల్గొన్నారు.



