– ఈ నెల 30 వరకు గడువు
– రైతులకు ఏడీఏ పెంటేల రవికుమార్ విజ్ఞప్తి
నవతెలంగాణ – అశ్వారావుపేట
డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) ప్రక్రియను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయనున్నట్లు ఏడీఏ పెంటేల రవికుమార్ బుధవారం తెలిపారు. గ్రామాల వారీగా సర్వే వాలంటీర్లు సర్వే నిర్వహిస్తున్నారని,సర్వే నంబర్ వారీగా రైతులు సాగు చేస్తున్న ప్రతి పంటను నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు.సర్వే పూర్తయిన అనంతరం సంబంధిత రైతుల మొబైల్ ఫోన్ కు సందేశం వస్తుందని తెలిపారు.
వాలంటీర్ నమోదు చేసిన పంట వివరాలను సంబంధిత ఏఈఓ పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుందన్నారు.పంట నమోదు వివరాల్లో ఏమైనా తప్పులు, పొరపాట్లు ఉంటే రైతుతో ధ్రువీకరించుకుని వాలంటీర్ కు తిరిగి పంపించాలని,వాలంటీర్ సవరణలు చేసిన తర్వాతే ఏఈఓ ఆమోదం తెలపాలని సూచించారు.
ఉద్యాన పంటల్లో అంతర పంటలు లేదా ఇతర అంతర పంటలను సాగు చేస్తున్న రైతులకు ఆయా పంటల వారీగా వేర్వేరుగా మొబైల్ సందేశాలు వస్తాయని తెలిపారు.సందేశం వచ్చిన 72 గంటల్లో గా సంబంధిత ఏఈఓ ను సంప్రదించి వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదయ్యే వివరాలే భవిష్యత్లో ధాన్యం కొనుగోళ్లతో పాటు సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు ప్రాతిపదికగా ఉంటాయని వ్యవసాయ శాఖ తెలిపిందన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి, తమ పొలాల్లో సాగు చేస్తున్న పంటల వివరాలు వాస్తవికంగా నమోదు అయ్యేలా సర్వే వాలంటీర్లకు సహకరించాలని ఏడీఏ పెంటేల రవికుమార్ విజ్ఞప్తి చేశారు.



