– సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి
– రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి
– జేసీ వేణుగోపాల్
నవతెలంగాణ – అశ్వారావుపేట
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు పునరుద్ధరణ చేసేందుకే నోటీసులు జారీ చేస్తున్నామని, నోటీసులు అందుకున్న వారు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి తిరిగి ఓటు నమోదు చేసుకోవాలని నియోజకవర్గ ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు.
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారి, తహసీల్దార్ దాసరి కిశోర్ అధ్యక్షతన ఎస్ఐఆర్లో నోటీసులు అందుకున్న ఓటర్లపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న జేసీ వేణుగోపాల్ ఎస్ఐఆర్ సూపర్వైజర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్ఐఆర్ అనంతరం 36,354 మందికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. మంగళవారం నాటికి 26,824 మంది ఆధారాలు సమర్పించారని, ఇంకా 9,530 మంది నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు.
నోటీసులు అందుకున్న వారు ఓటు తొలగిపోతుందనే భయాన్ని వీడాలని సూచించారు. నోటీసుల్లో సూచించిన విధంగా సరైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి ఓటును పునరుద్ధరించుకోవాలని తెలిపారు. గ్రామాల్లో రాజకీయ పార్టీల శ్రేణులు అధికారులకు సహకరించాలని, నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి ఓటు హక్కు పునరుద్ధరించుకునేలా కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి తహసీల్దార్లు స్వాతి బిందు, స్వర్ణ, మున్సిపల్ కమిషనర్ దిలీప్రెడ్డి, ఎన్నికల డీటీ సయ్యద్ హుస్సేన్, ఆర్ఐలు రామకృష్ణ, పద్మావతి, సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్ ప్రతినిధులు బుడితి చిరంజీవి, రామకృష్ణ, తుమ్మ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.



