నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్కు సంబంధించిన విడాకుల కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. తన భార్య సంగీత నుంచి విడాకులు కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. అయితే, ఇరుపక్షాల అభ్యర్థన మేరకు కేసు విచారణను జూన్ 15వ తేదీకి వాయిదా వేసింది.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్, ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన విడాకుల కేసు విచారణకు వచ్చింది. గతంలో ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు విజయ్కు సమన్లు జారీ చేసింది. అయితే, సోమవారం ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టులో ఒక తాజా పిటిషన్ దాఖలు చేసి, విచారణను వాయిదా వేయాలని కోరారు.
మరోవైపు వీరిద్దరి విడాకుల నేపథ్యంలో సెటిల్మెంట్కు సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరస్పర విడాకులకు నామినేషన్లో విజయ్ తెలిపిన ఆస్తి వివరాల ప్రాతిపదికన రూ.250 కోట్లు సెటిల్మెంట్ ఇవ్వాలని సంగీత అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. కుమారుడు, కుమార్తెలకు కూడా సెటిల్మెంట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. సంగీతకు మాత్రం రూ.35 కోట్లు సెటిల్మెంట్ ఇచ్చేందుకు విజయ్ ఆమోదించినట్లు, కుమారుడు, కుమార్తెను చూసుకుంటానని చెప్పినట్లు కోలీవుడ్ మీడియా పేర్కొంది.



