– మోడీ దిష్టిబొమ్మ దహనం..
– సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
యూపీఐ చెల్లింపులపై ఛార్జీల విధింపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు గోకినపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఛార్జీల ప్రతిపాదనను నిరసిస్తూ శనివారం అశ్వారావుపేట మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా గోకినపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘భవిష్యత్తంతా డిజిటల్మయం.. క్యాష్లెస్ ఎకానమీ’ అంటూ ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఫోన్పే, గూగుల్పే వంటి యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించే దిశగా చర్యలు చేపడుతోందని విమర్శించారు. రూ.2 వేల వరకు ఛార్జీలు ఉండవని చెబుతున్నప్పటికీ, భవిష్యత్తులో ఈ విధానం సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులపై ఆర్థిక భారంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకవైపు బడా కార్పొరేట్లకు రాయితీలు కల్పిస్తూ, మరోవైపు సామాన్యులపై పన్నులు, ఛార్జీల పేరుతో భారం మోపడం సరికాదన్నారు. యూపీఐ ఛార్జీల నిర్ణయం వెనుక అమెరికా ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలపై అదనపు భారం పడకుండా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. లేనిపక్షంలో అన్ని వర్గాల ప్రజలను సమీకరించి పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా నాయకులు కంగాల కల్లయ్య, మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు, అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు కంగాల కన్నయ్య, కణితి జగ్గారావు, తెల్లం సత్యం, టీయూసీఐ నాయకులు జుజ్జురి శ్రీనివాసరావు, కుమారస్వామి, ఇ. మహేష్ తదితరులు పాల్గొన్నారు.



