నవతెలంగాణ – హైదరాబాద్ : 24 గంటల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందిన విషాద ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. దీంతో వారి పదేండ్ల కుమారుడు అనాథ అయ్మాడు. పట్టణంలోని పిట్టలవాడకు చెందిన నైతం నవీన్కుమార్ (33) స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య లత (31) కొంతకాలంగా పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్న అమె శుక్రవారం జగిత్యాలలో చికిత్స చేయించుకుని కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
భార్య మృతితో తీవ్ర మనోవేదనకు గురైన నవీన్కుమార్.. శనివారం రాత్రి 8:30 గంటల సమయంలో ఇంటి వద్ద మృతి చెందారు. ఆయన కూడా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య మృతిని తట్టుకోలేకనే ఆయన మృతి చెంది ఉంటారని బంధువులు, స్థానికులు భావిస్తున్నారు. అయితే ఆయన మృతికి ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉంది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పదేళ్ల బాలుడు దిక్కుతోచని స్థితిలో రోదించడం అక్కడున్న వారిని కలచివేసింది.



