– భూపాలపల్లి తహసిల్దార్ వి. శ్రీనివాసులు
నవతెలంగాణ-భూపాలపల్లి : భూభారతి చట్టంతో ప్రజల భూ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని, రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి తహసిల్దార్ వి. శ్రీనివాసులు తెలిపారు. బుధవారం మండలంలోని రాంపూర్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూసదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈనెల 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. భూ రికార్డులో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు,వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం,
ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సం బంధించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువులోపు సమస్యలను పరిష్కరిస్తారన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందన్నారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఇదే క్రమంలో భూపాలపల్లి మండలం గుడాడు పల్లి గ్రామంలో డిప్యూటీ తహసిల్దార్ అంజలి రెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమాలలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అజారుద్దీన్, రామస్వామి, అసిస్టెంట్ సర్వేయర్ శివ, జూనియర్ అసిస్టెంట్ మొగిలి, టైపిస్ట్ రాజు,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.