– పోలింగ్ కేంద్రాల భౌగోళిక మ్యాప్ల తయారీ
– రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ
– ఓటర్ల ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల పెంపు
– ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఖరారు
– రాజకీయ పార్టీల్లో ఎన్నికల హడావుడి
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గ్రామ పంచాయతీ, జిల్లా, మండల పరిషత్లకు ఇప్పటికే పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర కావస్తుంది. ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందాల్సిన నిధులూ ఆగిపోయాయి. మరో పక్క బీసీ రిజర్వేషన్లు, ఆరు గ్యారంటీల అమలు వంటి సానుకూలాంశాలతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సైతం ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఖరారవ్వగా ఈ నెల 21 వరకు పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన, పెంపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇవ్వగానే ఎన్నికల సంఘం ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇవ్వొచ్చనే అభిప్రాయముంది. దాంతో రాజకీయ పార్టీలు సైతం స్థానిక సంస్థలకు సిద్ధమవుతున్నాయి. ఆశావహులు హడావుడి చేస్తున్నారు.
రాజ్యాంగం కల్పించిన అధికారాలు, విధుల ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులరీత్యా ఐదేండ్ల పదవీ కాలం ముగిసినప్పటికీ ఇప్పటికీ గ్రామ పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. ఎంతో కాలం ఆలస్యం చేయడమంటే రాజ్యాంగ ఉల్లంఘనగా భావించాల్సి వస్తంది. అందు కోసం రాష్ట్ర ప్రభుత్వం జులై, ఆగస్టులో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపేందుకు సిద్ధం కావాలని అధికార యంత్రాంగాన్ని పురమాయించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ అధికారులు ఎన్నికల ప్రకియలో నిమగమయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 1604 గ్రామ పంచాయతీలు, 74 జెడ్పీటీసీ, 696 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అదే విధంగా 21 మున్సిపాలిటీలుండగా వీటిల్లో 394 కౌన్సిలర్ స్థానాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 2019 ఎన్నికల్లో 25 జెడ్పీటీసీ స్థానాలుండగా కొత్తగా చౌటకూర్, నిజాంపేట మండలాలేర్పడ్డాయి. దాంతో 27 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 295 ఎంపీటీసీ స్థానాలుండగా కొత్తగా ఏర్పడిన 4 మున్సిపాలిటీల్లో 11 గ్రామాలను విలీనం చేయడంతో 19 ఎంపీటీసీ స్థానాలు తగ్గడం వల్ల ప్రస్తుతం 276 స్థానాలకే ఎన్నికలు జరగనున్నాయి. 8 మున్సిపాలిటీలుండగా కొత్తగా గుమ్మడిదల, గడ్డపోతారం, కోహీర్, ఇస్నాపూర్ ఏర్పడ్డాయి. వీటిల్లో 76 వార్డులు ఏర్పాటు చేయడంతో జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీల్లో 236 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మెదక్ జిల్లాలో గతంలో 20 మండలాలుండగా కొత్తగా మాసాయిపేట ఏర్పడటంతో 21 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. కొత్తగా ఒక ఎంపీటీసీ స్థానం పెరగడంతో 190 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు మున్సిపాలిటీల్లో 75 వార్డులున్నాయి. సిద్దిపేట జిల్లాలో 26 జెడ్పీటీసీ, 230 ఎంపీటీసీ, ఐదు మున్సిపాలిటీల్లోని 83 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎన్నికల ప్రక్రియలో అధికార యంత్రాంగం
స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు సిద్దంగా ఉండాలని ఈసీ ఆదేశించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనుల్ని చక్కదిద్దుతున్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాత, కొత్త మున్సిపాలిటీల్లో ఈ నెల 21 వరకు వార్డుల విభజన, పెంపుదల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ‘నజరీ నక్ష’ పోలింగ్ కేంద్రాల భౌగోళిక మ్యాప్లను రూపొందించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల భౌగోళిక సమాచారం, సౌకర్యాలు, రవాణా మార్గాలపై చర్చించారు. ఓటర్ల ఇంటింటి సర్వే ద్వారా పోలింగ్ కేంద్రాల పెంపు, ఒకే కుటుంబం ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లేసేలా మార్పులు చేయాలని సూచించారు. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల్ని నియమించారు. వారందరికీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ కూడా ఇచ్చారు. రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్ ఎన్నికలతో పాటు పార్టీలకతీతంగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల ముద్రణ కోసం ఏర్పాట్లు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట మూడు జిల్లాల్లో జరుగుతున్నాయి.
రాజకీయ పార్టీల హడావుడి
స్థానిక సంస్థల ఎన్నికలు జులైలో జరుగుతాయన్న సమాచారంతో అధికార పార్టీ హడావుడి కనిపిస్తుంది. మరో పక్క స్థానిక సంస్థల్లో పట్టు సాధించాలని భావిస్తున్నారు. ఆరు గ్యారంటీల్లో ఎక్కువ భాగం అమలు చేయడంతో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, కుల గణన వంటి ఆంశాలు సానుకూల ప్రభావం చూపుతాయని కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం భావిస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్గా పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు సైతం ప్రజల్ని అంటిపెట్టుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. రాజీవ్ యువ వికాసం, భూ భారతి, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు వంటి కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతల జోరు కనిపిస్తుంది. విపక్షమైన బీఆర్ఎస్ సైతం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ స్థానమున్నందున పట్టు నిలుపుకోవాలని చూస్తుంది. ప్రజా సమస్యలపై పని చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో మాజీ ప్రజా ప్రతినిధులంతా యాక్టీవ్ రోల్ ప్లే చేస్తున్నారు. వామపక్షాలైన సీపీఐ(ఎం), సీపీఐ సైతం పట్టున్న చోట ప్రజా సమస్యలపై కేంద్రీకరించి పని చేస్తున్నాయి. బీజేపీ సైతం పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.