నవతెలంగాణ-హైదరాబాద్: ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ఎదుట విచారణకు హాజరయ్యారు. తరగతి గదుల నిర్మాణంలో అవినీతి అరోపణలపై ఎసిబి బుధవారం ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ విచారణకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ రాజధానిలో గత ఆప్ ప్రభుత్వం విద్యను మెరుగుపరిచేందుకు కృషి చేసిందని, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కీలక సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు ఢిల్లీ ప్రభుత్వం యత్నిస్తోందని అన్నారు. ఫీజులు పెంచడంలో ప్రయివేటు పాఠశాలలకు సహాయం చేస్తున్నారని మండిపడ్డారు. పాఠశాలల అభివృద్ధికి మాజీ విద్యామంత్రి మనీష్ సిసోడియా తీవ్ర కృషి చేశారని, ఆయనకు సమన్లు జారీ చేశారని, తనకు కూడా సమన్లు జారీ అయ్యాయని సత్యేందర్ జైన్ పేర్కొన్నారు. ఇవన్నీ కూడా కీలక సమస్యల నుండి దృష్టి మళ్లించే ఎత్తుగడలని అన్నారు.
కాగా, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 12,000 తరగతి గదులు లేదా సెమీ-పర్మినెంట్ నిర్మాణంలో రూ.2,000 కోట్ల ఆర్థిక అవతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏప్రిల్ 30 ఎసిబి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈ సమన్లు జారీ అయ్యాయి. జూన్6న సత్యేందర్ జైన్, జూన్ 9న సిసోడియా విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లలో పేర్కొంది.