– మోడీ సర్కార్కు వ్యూహానికి రైతుల ఎదురుదాడి
న్యూఢిల్లీ : రైతులు చేపడుతున్న ఢిల్లీ చలో మార్చ్ రెండో రోజుకి చేరుకుంది. పంజాబ్, హర్యానా సరిహద్దుల నుంచి రైతులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. అయితే రైతులను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. వారిపై హర్యానా పోలీసులు డ్రోన్ల ద్వారా టియర్గ్యాస్ను ప్రయోగించారు. డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తున్నారు. అయితే రైతులు వాటికి గాలిపటాలతో చెక్ పెడుతున్నారు. గాలిపటాలను ఎగరవేయడంతో వాటి దారాలు డ్రోన్లకు చుట్టుకుని కూలిపోతున్నాయి. ఈ దృశ్యాలు సోషల్మీడియాలో వైరలయ్యాయి. కనీస మద్దతు ధర, రుణ మాఫీ సహా ఇతర వ్యవసాయ సంస్కరణలకు చట్టపరమైన హామీని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. రైతులపై టియర్గ్యాస్ షెల్స్ ప్రయోగించడంతో అంబాలా సమీపంలోని శంబు సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.