Sunday, June 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలురెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్లు కాదు: హరీష్ రావు

రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్లు కాదు: హరీష్ రావు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్లు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన తెలంగాణ భవన్‌లో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గురుంచి మహారాష్ట్ర కలిసినప్పుడు సీఎం పృద్వీరాజ్ చౌహాస్, ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లేఖను గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పకుండా చర్చలు జరిపామని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకే మహారాష్ట్రకు వెళ్లి చర్చించి ఒప్పించామన్నారు.  ‘‘కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కి.మీ సొరంగాలు, 1,531 కి.మీ గ్రావిటీ కాలువలు, 98 కి.మీ ప్రెజర్‌ మెయిన్స్‌, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీటి ఎత్తిపోతలు. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోసేలా మొదట రూపకల్పన చేశారు. తమ్మిడిహట్టి వద్ద నీళ్లు తక్కువ ఉంటాయని ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చాం. మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా 85 పియర్లుగా నిర్మించారు. కాళేశ్వరం లేకుండా పంటలు పండాయని కాంగ్రెస్‌ చెబుతోంది. ఈ ప్రాజెక్టు వల్లనే యాసంగిలోనూ పంటలు పండాయి. ఒక ఏడాది కరువు వస్తే, ఎస్సారెస్పీకి కూడా నీళ్లను రివర్స్ పంపింగ్ చేసినం. ఈ ప్రాజెక్టుకు 3 వనరుల ద్వారా నీటి లభ్యత ఉంది. ఆ నీటితో వేలాది చెరువులు నింపొచ్చు. మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్‌ వరకు నిర్మించినవన్నీ వాడకంలోనే ఉన్నాయి. కాళేశ్వరం కింద కాలువ ద్వారానే 90 వేల ఎకరాలకు నీరు అందించొచ్చు.  రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు గోదావరి జలాల్లో 940 టీఎంసీలు కేటాయించారు. తెలంగాణ గోదావరి జలాలను ఏనాడూ 400 టీఎంసీలకు మించి వాడుకోలేదు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో అనుమతులు కూడా సాధించలేదు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించకుండానే కాలువల తవ్వకం పనులు చేపట్టారు. 2007లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని రూ.17 వేల కోట్లుగా చెప్పారు. ప్రాజెక్టు ప్రారంభించకముందే 2011నాటికి అంచనా వ్యయాన్ని రూ.40 వేల కోట్లకు పెంచారు’’అని హరీశ్‌రావు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -