నవతెలంగాణ – హైదరాబాద్ : మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు జాతీయ స్థాయిలో మరోసారి గర్వించదగ్గ గౌరవం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో దేశానికి విశేష సేవలు అందించిన ప్రముఖులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అత్యున్నత పౌర పురస్కారాలను అందజేశారు. ఈ విడతలో మొత్తం 47 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేయగా.. అందులో మన టాలీవుడ్ లెజెండ్స్ ఉండటం విశేషం.
నాలుగు దశాబ్దాలుగా వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన నటనతో, హాస్యంతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్.. కళారంగానికి చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు. నటుడిగా, నిర్మాతగా ‘జయభేరి’ బ్యానర్పై అద్భుతమైన చిత్రాలు నిర్మించడమే కాకుండా, ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


