నవతెలంగాణ-పెద్దవంగర
నేత్రదాత భవిరిశెట్టి నాగరాణి సంస్మరణ సభను మంగళవారం పెద్దవంగర లోని వారి నివాసంలో ఘనంగా నిర్వహించారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు టి. శ్రవణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నేత్ర, అవయవ, శరీర దానాలపై బంధుమిత్రులకు అవగాహన కల్పించారు.
ముఖ్య అతిథులుగా పాల్గొన్న లయన్ డాక్టర్ నాగవాణి, మనోహర్ మాట్లాడుతూ నాగరాణి నేత్రదానం చేయడం కుటుంబ సభ్యులకు, సమాజానికి ఆదర్శమని కొనియాడారు. మరణానంతరం నేత్రాలు, అవయవాలు, శరీరాన్ని దానం చేసి మానవ జన్మను సార్థకం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సదాశయ ఫౌండేషన్ గాయకుడు భవిరిశెట్టి వెంకన్న నాగరాణిని స్మరిస్తూ పాట ఆలపించగా సభికులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నాగరాణి భర్త పనికుండలం, కుమారులు కార్తీక్, కళ్యాణ్లను సదాశయ ఫౌండేషన్ జ్ఞాపికతో సత్కరించింది. కార్యక్రమంలో శ్రీనివాస్, నాగభూషణం, చౌడవరపు రాము, కొడకండ్ల రాజు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.



