– అశ్వారావుపేటకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ లెర్నింగ్ సెంటర్ మంజూరు
– ఈ నెల 7 వరకు దరఖాస్తుల స్వీకరణ
– డిగ్రీ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డా. ఎన్. గోపి
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట ప్రాంత విద్యార్థులు, ఉద్యోగార్థులు, మధ్యలో చదువు నిలిపివేసిన యువతకు శుభవార్త. ఇకపై ఉన్నత దూరవిద్య కోసం కొత్తగూడెం, సత్తుపల్లి, ఖమ్మం వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అశ్వారావుపేటలోనే డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ లెర్నింగ్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.
ఇప్పటివరకు ఈ ప్రాంతంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పదో తరగతి వరకు మాత్రమే అవకాశం ఉండేది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సుల్లో కూడా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డా. ఎన్. గోపి సోమవారం తెలిపారు.
దూరవిద్య ద్వారా ఉన్నత చదువులు అభ్యసించాలనుకునే యువకులు, ఉద్యోగులు, గృహిణులు, చదువు మధ్యలో నిలిపివేసిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగుతుందని, అర్హులైన అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అశ్వారావుపేటలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల పరిసర మండలాల విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.



