నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్ గడ్ అడవుల్లో మావోయిష్టు అగ్రనాయకులను ఎన్ కౌంటర్ చేసిన అధికారులను కేంద్ర హోంమంత్రి సన్మానించారు. శనివారంలో ఛత్తీస్ గడ్ సీఎం విష్టుదేవ్ సాయి సమక్షంలో భద్రతా బలగాల ఉన్నతాధికారులు ఢిల్లీలో అమిత్ షాను కలిశారు. విజయవంతంగా మావోయిష్టు కీలక నేతలను ఎన్ కౌంటర్ లో హతం చేసినందకు అధికారులను అభినందించారు. త్వరలోనే ఛత్తీస్గడ్ రాష్ట్రంలో పర్యటిస్తానని, ఆపరేషన్లో పాల్గొన్న జవాన్లను కలుసుకుంటానని అమిత్ షా చెప్పారు.
కాగా,మావోయిష్టుల అంతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన కగార్ తో మావోయిష్టు ఉద్యమానకి వెన్నుముకగా ఉన్న అనేక మంది అగ్రనాయకులు నెలకొరిగారు. నెలల తరబడి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒరిస్సా, జార్జండ్ తదితర రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు మారణహోమం సృష్టించాయి. దట్టమైన అడవుల్లో కూంబింగ్ నిర్వహించాయి. మావోయిష్టుల అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, సుధాకర్ తో పాటు అనేక మంది మావోయిష్టులను ఎన్ కౌంటర్లో మట్టుబెట్టాయి. 2024-2025 మధ్య మావోయిస్టులు,భద్రతా దళాల మధ్య అనేక ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ కాల్పుల్లో కీలక నేతలతో పాటు 186 మంది మావోయిస్టు కార్యకర్తలు మరణించగా, బస్తర్ రేంజ్లో 403 మంది చనిపోయారు.
అయితే శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపేయాలని పలు మార్లు మావోయిష్టు కేంద్ర కమిటీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. మరోవైపు వివిధ పౌర సంఘాలు, ప్రతిపక్ష, లెప్ట్ పార్టీలు మావోయిష్టులను శాంతి చర్చలకు పిలువాలని, వారి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మారాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ కేంద్ర, రాష్ట్ర సర్కార్ల నుంచి నేటి వరకు కూడా ఎలాంటి స్పందన రాకపోగా..కేంద్ర హోంమంత్రి డెడ్ లైన్ పేరుతో 2026 మార్చి లోపు మావోయిష్టులను దేశంలో లేకుండా చేస్తామని బీరాలు పలుకుతున్నారు.